మహబూబాబాద్, జూన్ 3 : మాజీ మంత్రి ఆగమ చంద్రశేఖర్ ఆగమాగం మాట్లాడుతున్నాడని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చేయాలని కేసీఆర్ చూశారని అర్థం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.
శుక్రవారం మహబూబాబాద్లో పట్టణ ప్రగతిని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ 2001లోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఉద్యమ ప్రస్థానం సాగించారని గుర్తుచేశారు. చంద్రశేఖర్ పెద్ద గజిని అని, ఆయన నిద్రపోయి లేచి ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ఎద్దేవాచేశారు.
గత సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆధ్వర్యంలో బీజేపీలో చేరగానే ఇవన్నీ గుర్తుకొచ్చాయా? అని ప్రశ్నించారు. సీఎంను ఉద్దేశించి మతిలేకుండా మాట్లాడటం సరికాదన్నారు. సొంత ప్రయోజనాల కోసం స్వార్థంగా మాట్లాడితే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.