మేడిపల్లి, ఫిబ్రవరి 22: కాంగ్రెస్ ఆచరణకు సాధ్యం కానీ హామీలిచ్చి ఓట్లు దండుకున్నదని కరీంనగర్ మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ విమర్శించారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్లలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు. వారం పది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నదని, దానిని సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటివరకు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.
రెండ్రోజుల్లో 200 యూనిట్ల కరెంట్, రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీలు అమలు చేస్తామని ప్రకటించినందున వెంటనే జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఏప్రిల్, మే మాసాల్లో క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని సూచించారు. కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షతోపాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4వేల పెన్షన్ ఇవ్వాలని సూచించారు.