హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి సర్కిల్లోని ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ అడవులు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయి. ఈ సర్కిల్ పరిధిలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన పనులను కంపా అటవీ ముఖ్య సంరక్షణ అధికారి లోకేశ్ జైస్వాల్ పరిశీలించారు. ఈ సర్కిల్లో అటవీ శాఖ చెట్లు నాటడంతోపాటు నర్సరీలు, రోడ్లు, ఫైర్లైన్లు, వాచ్టవర్లు, బేస్ క్యాంపులు, సిబ్బంది నివాస గృహాలు, వన్యపాణుల కోసం నీటికుంటలు, గడ్డిమైదానాలు, చెక్డ్యామ్లు, రాతి కట్టడాలు, కందకాల నిర్మాణం వంటి పనులను చేపట్టింది.
ఈ పనులను పరిశీలించిన జైస్వాల్.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. అటవీశాఖ 340 ఫారెస్ట్ బ్లాక్లలోని 6,29,422 హెక్టార్ల విస్తీర్ణంలో పునరుజ్జీవన పనులు చేపట్టింది. నీటి సంరక్షణకు 5,214 రాతికట్టడాలను, 388 కుంటలను, 88 చిన్న నీటి కుంటలను, 314 చెక్డ్యాంలను, 29 వాచ్టవర్లను నిర్మించారు. అగ్ని ప్రమాదాల నివారణకు 3773 కి.మీ మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చేశారు. సుమారు 14,012 హెక్టార్లలో కొత్తగా మొక్కలు నాటారు, 469 హెక్టార్ల విస్తీర్ణంలో గడ్డి మైదానాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రాద్రి సర్కిల్లోని అటవీ ప్రాంతం కొత్త జీవకళను సంతరించుకున్నది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 632 చ.కి.మీ మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. ఇది దేశంలో రెండవ అతిపెద్ద పెరుగుదల. ఇందులో భద్రాద్రి సర్కిల్దే కీలక పాత్ర అని పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్ తెలిపారు.