ACB | హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన శివ బాలకృష్ణ ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
రెరా కార్యదర్శి శివ బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. శివబాలకృష్ణను సస్పెన్షన్పై హెచ్ఎండీఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దాన కిశోర్ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మెట్ర్ రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా పని చేశారు శివ బాలకృష్ణ. రెరా ఇంచార్జి కార్యదర్శిగా కూడా పని చేశారు.
శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను కనుగొన్నట్టు వెల్లడించారు. సోదాల్లో దొరికిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8,26,48,999 అని, బయటి మార్కెట్లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించిన వెరిఫికేషన్ జరుగుతున్నదని వివరించారు. ఏసీబీ యాక్ట్లోని యూ/ఎస్ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు.