BJP | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): బీజేపీకి దక్షణాదిలోనే కాదు ఉత్తరాదిలోనూ గడ్డు పరిస్థితే ఎదురవుతున్నది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం. ఉత్తరాదిలో తమకు తిరుగులేదని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో మేకపోతు గాంభీర్యమే తప్ప వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తున్నది. మధ్యప్రదేశ్లో 72 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించగా.. అందులో సీఎం శివరాజ్సింగ్ చౌహాన్కు టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది.
వరుసగా 18 ఏండ్లకు పైగా సీఎంగా ఉన్న చౌహాన్కు టికెట్ ప్రకటించకపోవడానికి కారణం ఆయన ఓడిపోతారనే భయమే అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఓటమి భయంతోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతున్నట్టు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్లోనూ కేంద్ర మంత్రులను బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.
మధ్యప్రదేశ్ బరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు
మధ్యప్రదేశ్లో ఏడుగురు ఎంపీలను బీజేపీ బరిలోకి దించింది. వీరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ కూడా ఉన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే ఉన్నారు. కైలాష్ విజయ వర్గీయను దశాబ్దం తర్వాత ఇండోర్ నుంచి బరిలోకి దించింది. తోమర్ రెండు దశాబ్దాల తర్వాత గ్వాలియర్ నుంచి బరిలో దిగుతున్నారు. సీనియర్ నేతలను బరిలోకి దించడం ద్వారా అయినా గెలుపు అవకాశాలు మెరుగుపడుతాయని బీజేపీ భావిస్తున్నదని చెబుతున్నారు. ఏడుగురు ఎంపీలను బరిలోకి దించడమే బీజేపీకి ఓటమి భయానికి సంకేతమని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
ఓటమిని ముందే అంగీకరించింది
బీజేపీ తన ఓటమిని ముందే అంగీకరించిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మునిగిపోతున్న పడవను కాపాడేందుకే కేంద్ర మంత్రులను, ఎంపీలను బరిలోకి దించిందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు.
రాజస్థాన్లోనూ అదే పరిస్థితి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర మంత్రులను బీజేపీ బరిలోకి దించుతున్నది. కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించింది. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తే గజేంద్ర సింగ్ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారు అవుతారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే మాజీ సీఎం వసుంధర రాజే నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తున్నది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా గెలిచిన ఎమ్మెల్యేలే శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారనే సంకేతాన్ని బీజేపీ ఇస్తున్నది.
తెలంగాణ బరిలోనూ ఎంపీలు
తెలంగాణలోనూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ముగ్గురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దించుతుందని జాతీయ మీడియా అంచనా వేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీకి అభ్యర్థుల కొరతను కొంతలో కొంత తీర్చడంతో పాటు ఎంపీలను బరిలోకి దించడం వల్ల పార్టీకి అంతో ఇంతో ఊపు వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు ఈ వర్గాల సమాచారం.
అశ్లీల నృత్యాలతో జనాల ఆకర్షణ
జనాలను ఆకర్షించేందుకు బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నది. పరివర్తన్ సంకల్ప్ యాత్రపేరుతో నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో మహిళలతో అసభ్యకర నృత్యాలు చేయించి, జనాన్ని ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. బీజేపీ చేపట్టిన పరివర్తన్ సంకల్ప్ యాత్ర ఈ నెల 25న ముగిసింది. ఈ సందర్భంగా మరుసటిరోజు రాజస్థాన్లోని జైపూర్లో ప్రధాని మోదీ సభ ఏర్పాటు చేయగా, జనాలు ఎవ్వరూ రాలేదు. దీంతో అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచిన అభ్యర్థులు మహిళలతో స్టేజ్ షో నిర్వహించి, సినిమా పాటలపై స్టెప్పులేయించారు. అల్వార్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పర్సా గ్రామంలో కనిపించిన ఈ దృశ్యం బీజేపీ దిగజారుడు రాజకీయానికి అద్దంపడుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.