కంటోన్మెంట్/మాదాపూర్/ మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డి బంధువు ఎనుముల మహానంద రెడ్డి చిత్రపురి సొసైటీకి కోశాధికారిగా వ్యవహరిస్తూ సొసైటీకి సంబంధించి సుమారు రూ. 3వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు తెలియడంతో తాను సోషల్ మీడియా వేదికగా చిత్రపురి సొసైటీకి సంబంధించిన అవకతవకలను బయటపెట్టానని తెలిపారు. ఇటీవల సొసైటీపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోలేదని చెప్పారు. కేవలం తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మాదాపూర్ పోలీస్స్టేషన్లో కాంగ్రెస్ నాయకుడు మహేశ్ కుమార్ గౌడ్ ఫిర్యాదు మేరకు తనపై అన్యాయంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. విచారణ కోసం అని పిలిచిన పోలీసులు తన వ్యక్తిగత ఫోన్ను సీజ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ పాలనలో ప్రశ్నిస్తే కేసులతో భయభ్రాంతులకు గురిచేయడమేంటని ప్రశ్నించారు. వంద రోజుల పాలనకాకముందే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డా రు. కేసుల పెడితే భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.