హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రజాపాలన ముసుగులో కాంగ్రెస్ పైరవీల పాలన నడుపుతున్నదని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 25 వరకు జారీ చేసిన 19,064 జీవోలలో కేవలం 3,290 ఆర్డర్లను పబ్లిక్ డొమైన్లో పెట్టి 15,774 దాచిపెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దల చీకటి దందాల కోసమే సీక్రెట్ జీవోలు జారీ చేస్తున్నదని దుయ్యబట్టారు. కోర్టు మొట్టికాయలేసినా సోయి రావడంలేదని నిప్పులు చెరిగారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్రెడ్డి, గౌతంప్రసాద్, మెట్టు కుమార్యాదవ్, రవినాయక్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని తాము కోర్టుకు వెళ్లగా ఎనిమిది వారాలు గడువు ఇచ్చిందని గుర్తుచేశారు. కోర్టులపై గౌరవంలేని కాంగ్రెస్ సర్కార్ పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. జీవోలన్నీ ప్రజలముందు పెట్టాలని 2015లో కేసీఆర్ జీవో 4 తెచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాంగ్రెస్ పాలనలో ఎస్సీ సంక్షేమశాఖలో 259 జీవోలు తెచ్చి 4 మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎస్టీ సంక్షేమశాఖలో 266 జీవోలకు 3, బీసీ సంక్షేమశాఖలో 288 జీవోలకు 88, మైనార్టీశాఖలో 155 జీవోలకు 2, జీఏడీలో 2,238కి 89, ఆరోగ్యశాఖలో 1,048కి ఒకటి మాత్రమే పబ్లిక్ డొమైన్లో పెట్టారు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో సెక్రటేరియట్ దందాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు.