హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అంతిమ నివాళి అర్పించేందుకు వీలుగా ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్లోని స్వగృహంలో ఉంచనున్నారు. పంజాగుట్ట హిందూ శ్మశానవాటికలో గురువారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
నాదెండ్ల మృతి పట్ల తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ ద్వారా రాకీయాల్లో ప్రవేశించారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1982లో టీడీపీలో చేరిన నాదెండ్ల భాస్కరరావు.. 1983లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1984లో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు కొంత మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పీఠమెక్కి నెలరోజులపాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎం పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్లో చేరిన నాదెండ్ల భాస్కరరావు.. 1989లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. భాస్కరరావు కుమారుల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీలో మంత్రిగా పనిచేస్తున్నారు.