హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా ఆరు గ్రామ పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ చట్టంలో సవరణలను ప్రభుత్వం ప్రతిపాదించింది. శుక్రవారం సవరణ బిల్లును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భద్రాచలం మండలంలో భద్రాచలం, సీతారాంనగర్, శాంతినగర్, బూర్గంపాడు మండలంలో సారపాక, ఐటీసీ, ఆసిఫాబాద్ జిల్లాలో రాజంపేటను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణలో పింఛన్ మొత్తం ఎక్కువ
కాంగ్రెస్, బీజేపీ రాష్ర్టాల్లో పింఛన్ల విధానం అత్యంత దారణంగా ఉన్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీజేపీ రాష్ర్టాల్లో రూ.3 వేల పింఛన్ ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు. పింఛన్ల అంశంపై ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్రెడ్డి, జాజుల సురేందర్, దానం నాగేందర్, మేరాజ్ జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
మణిపూర్లో రూ.200, దివ్యాంగులకు రూ.600, అసోం 250-550, నాగాలాండ్లో రూ.200 మిజోరంలో రూ.300, ఇతర రాష్ర్టాల్లో రూ.500 లోపే ఇస్తున్నారని వివరించారు. యూపీలో వెయ్యి, గుజరాత్లో రూ.వెయ్యి నుంచి రూ.1250, ఛత్తీస్గఢ్లో 350 -650 ఇస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పింఛన్దారుల సంఖ్య 44.12 లక్షలకు చేరుకొన్నదని, వృద్ధాప్య పింఛన్ల వయోపరిమితి తగ్గించిన తర్వాత కొత్తగా 5,37,048 లబ్ధిదారులు పెరిగారని వివరించారు. సాంకేతిక సమస్యలు, పెండింగ్లో ఉన్న పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.