నారాయణపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ వనజమ్మతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. రూ. 1.40 కోట్ల అంచనా వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 47.50 లక్షలతో నిర్మించిన మున్సిపాలిటీ డంపింగ్ యార్డు, తడి చెత్తతో వర్మికంపోస్టు తయారు చేసేందుకు నిర్మించిన షెడ్ ను ప్రారంభించారు.
రూ. 47.50 లక్షల వ్యయంతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ప్రారంభోత్సవం చేశారు.
రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో కొత్తగా నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. రూ.43.20 లక్షలతో కొత్తగా నిర్మించిన పురపాలక సంఘం సమావేశ మందిరానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు 70 సంవత్సరాల్లో తెలంగాణా ఎలా ఉంది? ఆ తర్వాత ఏ స్థాయిలో అభివృద్ధి సాధిస్తుందో గమనించాలని పేర్కొన్నారు.
మక్తల్ మున్సిపాలిటీలో ఏ ఒక్క సౌకర్యం లేకపోయేదని, ఈ రోజు పట్టణ ప్రజలు సేదతీరేందుకు చెరువు దగ్గర మినీ ట్యాంక్ బండ్, మున్సిపల్ కౌన్సిల్ హాల్, సమీకృత మార్కెట్ ఇలా ఎన్నో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. రూ. 55 లక్షలతో మున్సిపాలిటీ కార్యాలయ నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదం లభించనుందని తెలియజేసారు.
కౌన్సిలర్లు, అధికారులు అందరూ కలిసిమెలిసి పని చేసి మక్తల్ మున్సిపాలిటికి సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజా రాణి, మున్సిపల్ చైర్మన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, మార్కెట్ యార్డు చైర్మన్ రాజేష్ గౌడ్, డి.సి.సి.బి. చైర్మన్ నిజాంపాషా, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, తదితరులు పాల్గొన్నారు.