హైదరాబాద్ : తెలంగాణకు చెందిన అటవీ అధికారులతో అరణ్య భవన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అటవీ భూముల సర్వే, ఖచ్చితమైన సరిహద్దుల గుర్తింపు, పెరిగిన పచ్చదనం అధ్యయనం, ఇతర ఫారెస్ట్రీ పద్ధతుల్లో అధునాతన సాంకేతిక పద్ధతుల వినియోగంపై చర్చించారు. అటవీ భూముల మళ్లింపుకు కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలో పనిచేస్తూ, క్రమానుగత పద్ధతిలో అనుమతులకు వేదికైన పరివేశ్ పోర్టల్, అలాగే కంపా నిధులతో చేపట్టే ప్రత్యామ్నాయ అటవీకరణ పనుల పర్యవేక్షణకు ఉద్దేశించిన ఈ-గ్రీన్ వాచ్ పోర్టళ్ల పనితీరుపై చర్చించారు.
ఈ పోర్టళ్లు మరింత సరళతరంగా ఉండేందుకు, అవసరమైన మార్పు చేర్పులు చేసేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఆరా తీశారు. తెలంగాణ అటవీ శాఖ నూతన సాంకేతిక పద్ధతుల వినియోగంలో ముందుందని ఆయన ప్రశంసించారు. తెలంగాణ అటవీ శాఖ వినియోగిస్తున్న జీఐఎస్ (GIS -Geographic information system), ఎంఐఎస్ (MIS -Management Information Systems), రిమోట్ సెన్సింగ్ విధానాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగాన్ని అరణ్య భవన్లో నెలకొల్పేందుకు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ను అందించేందుకు అనూప్ సింగ్ ప్రతిపాదించారు. అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా పీసీసీఎఫ్ను కోరారు.
అటవీ సరిహద్దులను నిర్ధారించే ప్రక్రియ, కంపా నిధులతో చేపట్టిన పనుల వివరాలకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. వివిధ రకాలైనటు వంటి అటవీ రికార్డులు, నవీకరించే క్రమంలో రెవెన్యూ డిపార్టుమెంట్ సహకారంతో చేయాలని అనూప్ సింగ్ సూచించారు. ఇందుకోసం అవసరమైన చోట హై రిజల్యూషన్ శాటిలైట్ ఉపగ్రహ ఛాయా చిత్రాలను వాడతామని, క్షేత్ర స్థాయిలో కొలతలు, పట్టిక పుస్తకాలు ఉన్నచోట వాటిని అధునాతన సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి మ్యాపింగ్ చేసి జియో రిఫరెన్స్, గ్రామ పటాలతో సరిపోల్చుకుని నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.
ఈ ప్రక్రియ కోసం సర్వే ఆఫ్ ఇండియా, తెలంగాణ రిమోట్ సెన్సింగ్ సెంటర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లతో కూడిన అధ్యయన బృందం సహకారంతో పనిచేయాలని సూచించారు. సమీక్షా సమావేశంలో పాల్గొన్న పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ సిద్దానంద్ కుక్రేటీ, ఏకే సిన్హా, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎంజే అక్బర్, డిప్యూటీ కన్జర్వేటర్లు పీ శ్రీనివాస రావు, ఏ రామమూర్తి, ఐటీ, సర్వే విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.