హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో పలు అటవీశాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అరణ్యభవన్లో గురువారం ఆయనతో సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి ఆయుధాలు ఇచ్చే ప్రతిపాదనను అమలు చేయాలని సంఘాల ప్రతినిధులు కోరారు. ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు, ఖాళీల భర్తీ, రెవెన్యూ, పోలీసు శాఖతో సమన్వయం మరింతగా పెంచాలన్నారు. అన్ని బీట్లలో అటవీ హద్దులను కచ్చితంగా గుర్తించే ప్రక్రియను పూర్తిచేయాలని విజ్ఞప్తిచేశారు.
గొత్తికోయలు పోడు సాగుదారుల కిందకు రారని, వారిని అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి అడవి నుంచి బయటకు తీసుకొచ్చే కార్యాచరణ ప్రారంభించాలని కోరారు. ఈ సందర్భంగా డోబ్రియాల్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అటవీ ఉద్యోగులు, సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిషారమయ్యేలా చూస్తానని హామీఇచ్చారు. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్, ఫారెస్ట్ రేంజర్లు, స్టేట్ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐఎఫ్ఎస్ అసోసియేషన్-తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు శ్రీనివాసరావు హత్యను ఖండించారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఘటన తర్వాత ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించిన తీరుకు సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎంసీ పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్ తదితరులు పాల్గొన్నారు.
అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం చట్ట ప్రకారం విధులు నిర్వహిస్తున్న చండ్రుగొండ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు దారుణ హత్యను తెలంగాణ- ఏపీ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పీకే ఝా, కార్యదర్శి బీఎమ్ స్వామిదాస్ మాట్లాడుతూ.. వృత్తి నిబద్ధతతో కష్టపడి పనిచేసే అధికారి శ్రీనివాస్ అని చెప్పారు. ఆక్రమణకు గురైన అటవీ భూమిని కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు.