హైదరాబాద్: దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ (Dobriyal) అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో (Aranya bhavan) జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ విముక్తి కోసం ప్రాణాలు కోల్పోయిన వారందరినీ స్మరించుకోవటం, దేశంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ పాల్పంచుకోవడం సమర యోధుల త్యాగాలకు దక్కే నిజమైన గుర్తింపు అన్నారు.
తెలంగాణకు హరితహారం ద్వారా అటవీ శాఖకు దేశ వ్యాప్త గుర్తింపు దక్కిందని చెప్పారు. ప్రతీ ఉద్యోగి, అధికారి ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పీసీసీఎఫ్ కోరారు. గతేడాది కాలంగా అరణ్య భవన్లో పనిచేస్తూ మంచి ప్రతిభ కనపర్చిన ఉద్యోగులకు ఉన్నతాధికారుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందించారు.