హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచనున్నది. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. పరిహారం పెంచే ఫైల్పై తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. సచివాలయంలోని కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దేవాదాయ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, సిబ్బంది కార్యక్రమానికి హాజరై మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
అటవీశాఖ కార్యక్రలాపాలపై మంత్రి కొం డా సురేఖ తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్,హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియల్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణకు హరితహారం ద్వా రా ఇప్పటిదాకా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపా నిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ,దేవాదాయ శాఖలో ప్రస్తుత సిబ్బంది, కొత్తగా నియామకాలకు ఉన్న అవకాశాల గురించి ఆరా తీశారు. త్వరలోనే శాఖల వారీగా పూర్తి స్థాయి సమీక్షా సమావేశాలు చేపడతామని తెలిపారు. అట వీ, దేవాదాయ శాఖల్లోని సిబ్బంది, అధికారులు నిజాయితీగా పనిచేయాలని, జట్టుగా పనిచేసి లక్ష్యాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
నిర్మాణ, కూల్చివేత వ్యర్ధాల నిర్వహణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నివారించడం, శబ్ద, వాహన కాలుష్య నియంత్రణ వంటి అంశాలపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన వాల్ పోస్టర్ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. పర్యావరణ కాలుష్యానికి సంబంధించి వివిధ రకాల ఫిర్యాదుల నమోదు కోసం రూపొందించిన ‘జనవాణి, – కాలుష్య నివారిణి’ ఆన్లైన్ ప్రజా ఫిర్యాదుల మొబైల్ యాప్ను టీఎస్పీసీబీ సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ముఖ్య పర్యావరణాధికారి రఘుతో కలిసి లాంఛనంగా ఆవిష్కరించారు.