హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక విద్యకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో, రానున్న రోజుల్లో అటవీ, పర్యావరణ నిపుణులకు అంతే డిమాండ్ ఉండనున్నదని పలువురు అటవీ నిపుణులు అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాలలో శుక్రవారం ‘అటవీ జన్యువనరుల పరిరక్షణ, నిర్వహణ-మేధోపరమైన హకులు’ అన్న అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా ప్రముఖ అటవీ కళాశాలలు, సంస్థల తరపున నిపుణులు హాజరయ్యారు.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ నీరజా ప్రభాకర్, కర్ణాటక ధార్వాడ్ (సిర్సి) ఫారెస్ట్ కాలేజీ డీన్ వాసుదేవ, తమిళనాడు మెట్టుపలాయం ఫారెస్ట్ కాలేజీ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్, కేరళ ఫారెస్ట్ కాలేజీ డీన్ అనూప్, ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐకార్) సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ పరిమళన్, హిమాచల్ప్రదేశ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అభిలాశ్ దామోదరన్ తదితరులు మాట్లాడారు. ఎంతో ముందుచూపు, దార్శనికతతో తెలంగాణ సీఎం కేసీఆర్ అటవీ విద్యను ప్రోత్సహించటం గొప్ప విషయమని, హరితహారంతో పచ్చదనం పెరిగిందని ప్రశంసించారు. తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ వివిధ ప్రముఖ కాలేజీలు, అటవీ సంస్థల నిపుణుల సలహాలు, సూచనలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ కాలేజీ విద్యార్థులకు తమ అధ్యయనంలో భాగంగా పరిశీలించాల్సిన అంశాలు, పరిశోధన విషయాలపై ప్రధానంగా చర్చించారు.