హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వైద్యసేవలపై బ్రిటన్కు చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ గ్రూప్ (ఐహెచ్జీ) సంస్థ ప్రశంసల జల్లు కురిపించింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. ఈ మేరకు బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, ఐహెచ్జీ సీఈవో చేస్టర్ కింగ్, సీవోవో సైమన్ ఆశ్వర్త్, పృథ్వీ సహానీ తదితరులు బుధవారం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్, మెడికల్ కాలేజీలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానల గురించి మంత్రి హరీశ్రావు వారికి వివరించారు. అనంతరం విదేశీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తెలంగాణలో భారీగా మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తుండటం అభినందనీయమని కొనియాడారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదని, అభివృద్ధికి హైదరాబాద్ చిరునామాగా నిలిచిందని ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులకు సాంకేతిక సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఐహెచ్జీ ఇప్పటికే 55 దేశాల్లో 480 హెల్త్కేర్ ప్రాజెక్టులకు పూర్తిచేసినట్టు తెలిపారు. అనంతరం విదేశీ ప్రతినిధులను మంత్రి హరీశ్ శాలువాతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, డీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
త్వరలో 12 చోట్ల ప్రారంభం
ఆగస్టు 15లోగా మరో 131 బస్తీ దవాఖానలను ప్రారంభించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సిద్ధమైన 12 బస్తీ దవాఖానలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. బుధవారం ఆయన బస్తీ దవాఖానల పనితీరుపై ఎంసీఆర్హెచ్చార్డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బస్తీ దవాఖానల వల్ల ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతున్నదని, ఆదరణ పెరుగుతున్నదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలోని 259 బస్తీ దవాఖానల పనితీరు బాగున్నదని ప్రశంసించారు. కొత్తగా ప్రారంభించనున్న వాటితో మొత్తం బస్తీ దవాఖానల సంఖ్య 390కి పెరుగుతుందని చెప్పారు. బస్తీ దవాఖానల్లో అందిస్తున్న సేవలను ఆన్లైన్ చేయాలని, టెలి-కన్సల్టెన్సీ సేవలను పెంచాలని సూచించారు. టీ-డయాగ్నొస్టిక్స్ సహకారంతో చేపడుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు మరుసటి రోజే అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
‘బసవతారకం’సేవలు అభినందనీయం
లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్న అతికొద్ది దవాఖానల్లో బసవతారకం క్యాన్సర్ దవాఖాన ఒకటి అని మంత్రి హరీశ్రావు ప్రశంసించారు. బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ దవాఖాన 22వ వ్యవస్థాపక దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలతో ప్రారంభించిన దవాఖానను నందమూరి బాలకృష్ణ సమర్ధవంతంగా నడిపిస్తున్నారని అభినందించారు. ప్రభుత్వ దవాఖానలు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్యాన్సర్ చికిత్సను అందించేందుకు చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన చైర్మన్ నందమూరి బాలకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎంపీ నామా నాగేశ్వర్రావు, జేఎస్ఆర్ ప్రసాద్, సీఈవో డాక్టర్ ఆర్వీ ప్రభాకర్రావు, సీవోవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.