హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏ ఒక్క వర్గానికీ ప్రాధాన్యం ఇవ్వలేదని, ఏ రంగానికీ ఉపయోగకరంగా లేని ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని అమ్మడమే బీజేపీ విధానమని, మతపిచ్చి లేపి ఓట్లు కొల్లగొట్టుకోవడమే వారి లక్ష్యమని విమర్శించారు. బడ్జెట్పై సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
కేంద్ర బడ్జెట్లో అందరికీ గుండు సున్నా
పార్లమెంటులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలా దారుణమైంది. ఈ బడ్జెట్లో అందరికీ గుండుసున్నా. కల్ల, డొల్ల ప్రచారం. గోల్మాల్ గోవిందం తప్ప ఎవ్వరికీ ఏమి లేదు. వాళ్లు ఇష్టం ఉన్న లెక్కలు చెపుతారు కానీ వాస్తవ లెక్కలు వేరుగా ఉన్నాయి. ఎస్సీలు 20 కోట్లు, ఎస్టీలు 10 కోట్లు ఉన్నారని వాళ్లు లెక్కలు చెప్పారు. వాస్తవంగా వీరి జనాభా చాలా పెరిగిపోయింది. దగ్గర దగ్గర 19, 20 శాతానికి ఎస్టీలు పోయినట్లుంది. ఎస్సీలు కూడా పెరిగారు. కనీసం 38, 40 కోట్లు వీరి జనాభా ఉంటుంది. 38, 40 కోట్లు ఉండే జనాభా సంక్షేమానికి భారత ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ రూ.12,800 కోట్లు. ఇంతకంటే సిగ్గు, శరం, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. దళితులు, గిరిజనుల సంక్షేమం పట్ల ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది? తెలంగాణలో ప్రస్తుతం మన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద దళితబంధు, ఇతర పథకాలు కాకుండా రూ.33,611 కోట్లు. మొత్తం దేశ దళితుల జనాభాకు పెట్టిన డబ్బు ఒక్క రాష్ట్ర బడ్జెట్కు కూడా సమానం కాదు. అదీ గిరిజనుల పట్ల, దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. ఆరోపణలు చేస్తలేను. బడ్జెట్లో కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించిన లెక్కలే చెపుతున్నా. మాయ మశ్చీంద్ర. గోల్మాల్ గోవిందం. ఇవన్నీ కఠినమైన వాస్తవాలు.
రైతుల పెట్టుబడి రెట్టింపు చేశారు
2022 వరకు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చారు. అయ్యిందా? ఎరువులు, డీజిల్ ధరలు పెంచి రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారు. వరికోత యంత్రాలపైన రేట్లు పెంచి నాశనంచేశారు. పెట్టుబడి రెట్టింపు చేసిన్రు తప్ప, ఆదాయం రెట్టింపు చేయలేదు. ఆదాయం రెట్టింపు అయితే ఏడాదిపాటు రైతులు ఎండనక, వాన అనక, చలిలో ఎందుకు ఆందోళనచేస్తారు? 2022 వరకు అందరికీ ఇండ్లు అన్నారు? చేశారా? ప్రతి ఇంటికి రూ.15 లక్షలు ఇస్తం.. నల్లధనం తెస్తాం అన్నరు. తెచ్చారా? బీజేపీ హయాంలోనే నీరవ్మోదీలు, చోక్సీలు వంటి గజదొంగలు, బ్యాంకు దోపిడీగాళ్లు, బ్యాంకులను ముంచిన వాళ్లు అతి ఎక్కువ మంది విదేశాలు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నరు. మీరు బ్లాక్మనీ తెచ్చినోళ్లు కాదు. బ్లాక్మనీగాళ్లను బయటికి పంపిన ఘనులు మీరు. దేశంలో అందరికీ రూ.15 లక్షలు ఇస్తామని పచ్చి అబద్ధాలు చెప్పిన్రు. 15 పైసలు కూడా ఇవ్వలేదు. అన్నీ బోగసే.
ఎరువులపై సబ్సీడీలు తగ్గించారు
దేశంలో అంత పెద్ద రైతుల ఉద్యమం జరిగింది. చలికి ఎండకు దాదాపు 750 మంది రైతులు సచ్చిపోయిండ్రు. ప్రధాని వాళ్లకు క్షమాపణ చెప్పిండు కానీ బడ్జెట్లో వాళ్ల పేర్లు కూడ ప్రస్తావించలేదు. ప్రధాన మంత్రి చెంపలేసుకొని దేశం సాక్షిగానే రైతులకు క్షమాపణ చెప్పిండు. కానీ బడ్జెట్లో ఆ ప్రస్తావన లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉద్దీపనలు లేవు, ఏమీ లేదు. అంత ఒట్టిదే గుండు సున్నా.. ఇంకా ప్రమాదకర గంట కొట్టారు. యూరియా మీద సబ్సిడీని రూ.12,708 కోట్లు తగ్గించారు. ఇతర ఎరువుల మీద రూ.22,192 కోట్లు కలిపి రూ.34,900 కోట్లు ఎరువుల మీద సబ్సిడీని తగ్గించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన బహుమతి ఇది. ఇవన్నీ కూడా కఠోరమైన వాస్తవాలు.. బడ్జెట్ లెక్కలే.
నరేగా నిధులలో రూ.25 వేల కోట్లు కోత
దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఘోరంగా ఉన్నది పరిస్థితి. జాతీయ సరాసరి అనేక రాష్ట్రాల కన్నా సిగ్గుచేటుగా ఉన్నదని మేధావులు, ఎకనమిస్టులు అంతా ఘోషిస్తున్నారు. కరోనా దేశాన్ని పీడిస్తున్నది. ప్రజలు ఉపాధి కోల్పోతున్నరు. దయనీయమైన పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంలో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్లు కోత పెట్టిన్రు. రూ.98 వేల కోట్లు ఉంటే దానిని రూ.73 వేల కోట్లకు కుదించిన్రు. ఇది ఏరకమైన తెలివితేటలన్నట్టు? గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలు, కూలి చేసుకొని బతికే ప్రజల పట్ల మోదీ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. వ్యవసాయానికి తగ్గిస్తవు. ఎరువులకు తగ్గిస్తవు, నరేగాకు తగ్గిస్తవు, ఎరువులకు ధరలు పెంచుతవు. ఎస్సీ, ఎస్టీలు 40 కోట్ల జనాభా ఉంటే రూ.12,800 కోట్లు పెడతవు. అంటే దళితులకా, గిరిజనులకా, మైనారిటీలకా, రైతులకా.. ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నట్టు?
ఎఫ్ఆర్బీఎంకు… కరెంటు బిల్లులకు లంకె
చాలా ఘోరమైన పరిస్థితుల్లో నిధులు కోయడమే కాకుండా మళ్లీ పవర్ రిఫార్మ్స్ అని ఇంకో కొండి పెట్టారు. అసలు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి మెదడు లేదు. వాళ్లు అవలంబించేది వెరీ బ్యాడ్ పవర్ పాలసీ. వరస్ట్ పవర్ పాలసీ. రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితులు పెట్టి విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తే 0.5 శాతం ఇస్తమంటరు. విద్యుత్తు సంస్కరణలు అంటే వ్యవసాయ రంగానికి చార్జీలు పెట్టాలి.. మీదికేమో విద్యుత్తు సంస్కరణలు అని చెప్పరు… అసలు సంగతేమిటంటే మీటర్లు పెట్టి, దంచి ముక్కుపిండి కరెంటు బిల్లులు వసూలు చేయమంటరు.. అసలు సంగతి అది. చాలా తెలి తక్కువ మెదడు లేని ప్రభుత్వం. చాలా ఘోరమైన పద్ధతిలో ఈ దేశాన్ని నాశనం చేస్తున్నారు.
ఎవరిని ఉద్ధరిస్తున్నారు?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రతి ఏడాది ప్రకటిస్తారు. దానిలో చాలా సిగ్గుచేటు అంశం ఏందంటే.. నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే అధ్వాన్న స్థితిలో ఇండియా ఉన్నది. 116 దేశాల్లో సర్వే చేస్తే మన దేశం 101వ స్థానంలో ఉన్నది. మనకంటే 15 దేశాలే దరిద్రపుగొట్టు దేశాలు ఉన్నాయి. అదీ ఘనత వహించిన మోదీ ప్రభుత్వం సాధించిన గొప్పతనం. ఇంతదానికి సిగ్గులేకుండా డబ్బా కొట్టుకునుడు. మంది మీద పడి ఏడ్చుడు. ఇష్టం వచ్చినట్టు ఇతరులను నిందించుడు. ఇవాల్టి బడ్జెట్లో ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. రెండు లక్షల 11 వేల కోట్లు ఉంటే, దాన్ని 1.40 లక్షల కోట్లకు తగ్గించారు. మరి ఎవరిని ఉద్ధరిస్తున్నట్టు వీళ్లు?
15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతున్నది. ఇప్పుడు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అది మా లెక్క కాదు. కేంద్రం లెక్కనే. అన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, వీళ్లు (రాష్ట్ర బీజేపీ) తెలంగాణలో ధర్నా చేస్తం అంటరు. మంది మీద పడి ఏడ్వడం అంటే ఇదే. చాలా దారుణమైన పద్ధతిలో పచ్చి అబద్ధాలు చెప్తూ దేశాన్ని మోసం చేస్తున్నరు.
ఎవరి సంక్షేమం కోసం ఈ బడ్జెట్?
ధర్మమార్గంలో నడవాలంటూ శాంతిపర్వంలోని శ్లోకం చెప్పిన భారత ఆర్థిక మంత్రి.. కరోనా ఉన్నా కూడా దురదృష్టవశాత్తు ఆరోగ్యశాఖకు ఒక్కరూపాయి కూడా పెంచలేదు. కరోనాలాంటి మహమ్మారి పీడించిన తర్వాత.. మనం ఆరోగ్యశాఖపై ఎంత శ్రద్ధ చూపాలి? కానీ కేంద్రం హెల్త్ బడ్జెట్ను పెంచకపోగా, ఇంకా తగ్గించింది. బడ్జెట్లో సాంఘిక సంక్షేమంలేదు.. రైతు సంక్షేమంలేదు.. పేదల సంక్షేమం లేదు.. నిరుద్యోగ సమస్య పైన లేదు.. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు.. ఎడ్యుకేషన్కు రూపాయి పెంచలేదు.. మరి కేంద్రం వద్ద ఉన్న సంపద ఎక్కడికి పోతున్నట్టు? ఏం జరుగుతున్నట్టు? అంతా గోల్మాల్ గోవిందం. బ్యాంకుల్లో అప్పులు తీసుకొని వేలు, లక్షల కోట్ల రూపాయలు ముంచి పోయినోళ్లకు వీళ్లు సబ్సిడీలు ఇస్తరు. కరెంటు సంస్కరణల పేరుమీద కరెంటు సావుకార్ల జేబులు నింపే ప్రయత్నం చేస్తరు. రైతులు సమ్మె చేసి ఇంత గడ్బడ్ జరిగి.. ప్రధానమంత్రే స్వయంగా రైతులకు క్షమాపణ చెప్పిన సందర్భం మనం చూశాం. ఇంత జరిగినంక కూడా ఈ బడ్జెట్లో ఎమ్మస్పీ బిల్లు ప్రస్తావన లేదు. కరెంటు సంస్కరణల పేరిట మీటర్లు పెట్టబోమని చెప్పలేదు. మరి ఎవరిని ఉద్ధరించినట్టు? ఎవరికి కిరీటం పెట్టినట్టు? ఈ బడ్జెట్లో వ్యవసాయానికి పెంచలేదు. విద్యకు పెంచలేదు. ఆరోగ్యానికి పెంచలేదు. సంక్షేమానికి పెంచలేదు. దళితులకు పెంచలేదు. గిరిజనులకు పెంచలేదు. రైతులకు పెంచలేదు. మరి ఇంకెవరికి పెంచినట్టు? రేకుడబ్బాలో రాళ్లు వేసి ఊపినట్టు తప్ప. ఈ బడ్జెట్తో ఎవరికి మేలు జరిగినట్టు? ఎవరికి సంక్షేమం కోసం ఈ బడ్జెట్? ముస్లిం మైనారిటీలకైతే బడ్జెట్లో వీళ్లు ఎలాగూ పెట్టరు. ఎందుకంటే వాళ్ల గోత్రమే కుదరదాయే.