KCR | హైదరాబాద్, మార్చి 31(నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండిన పంటలకు ప్రతి ఎకరాకు రూ. 25వేల నష్ట పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు పరిహారం ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని వెంటాడుతామని హెచ్చరించారు. ఇప్పటికే కాంగ్రెస్ తెచ్చిన కరువుతో 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ మేరకు ఎండిన పంటలను పరిశీలించిన అనంతరం సూర్యాపేటలో కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. “రైతుల పంటలెండుతుంటే గుడ్డిగుర్రాల పండ్లు తోముతున్నారా? వీరు రైతులు కాదా? ఎండేవి పంటలు కాదా? మీకెవరికీ పట్టింపు లేదా? రైతుల తరఫున ప్రశ్నించేటోళ్లు ఎవ్వరూ లేరనుకుంటున్నారా? ఒక మహా సముద్రమంత బీఆర్ఎస్ ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో వందకు వందశాతం రైతుల పక్షాన పోరాటం చేస్తాం. మీ అసమర్థత వల్ల పొలాలు ఎండిపోయినవి కాబట్టి.. వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చి పంటలను లెక్కించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏ గ్రామంలో ఏ రైతు పంట ఎంత ఎండిందో లెక్క తీయాలి.
ధరలు పెరిగి రైతులకు భారమైంది కాబట్టి రూ. 25వేలు ప్రతి ఎకరాకు, ప్రతి రైతుకు చెల్లించాలి. ఇది చేసేంత వరకూ మిమ్మల్ని వెంటాడతం, వేటాడతం, ధర్నాలు చేస్తాం. నిద్రపోనివ్వం. మంత్రులు, ఎమ్మెల్యేలను గ్రామాల్లో నిలదీస్తాం. ప్రజాస్వామ్యంలో మాకు అడిగే హక్కు ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము దానికి న్యాయం చేయాలి. రాష్ట్రంలో మా బీఆర్ఎస్ దళాలు తిరుగుతున్నయి. మేము కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాం. మా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తిరుగుతున్నరు. మీకు చేతగాకపోతే కచ్చితంగా అన్ని లెక్కలు తీస్తాం. మిమ్మల్ని బజాట్లోకి ఈడుస్తాం. వందకు వందశాతం మీ చేత రైతులకు పరిహారం కక్కిస్తాం. ఆనాడు మేమిస్తే మీరు ఎకసెక్కాలాడిర్రు. ఇయ్యాల మేము డిమాండ్ చేస్తున్నాం. ఎండిపోయిన ప్రతి ఎకరాకు 25వేలు పరిహారం ఇవ్వాల్సిందే.
కాంగ్రెస్ అసమర్థత వల్లే..
నేను బరువైన గుండెతో ఎందుకు చెబుతున్నానంటే ఒక్క ఎకరం ఎండని తెలంగాణలో మీ అసమర్థత వల్ల 15-16 లక్షల ఎకరాల పంటలు ఎండబెట్టారు. పంట పెట్టంగనే ఎండిపోతే అదొక దరిద్రం. కానీ మీరు సగంసగం నీళ్లు ఇస్తరని నమ్మి పెట్టుబడులు పెట్టిర్రు పాపం రైతులు. ఎల్కారం గ్రామంలో ఓ మహిళ నాతో చెప్పుకొని ఏడ్చింది. ‘నీళ్లు ఇస్తమన్నరు సార్. పంట పెట్టుకున్నాం. రెండుమూడు తడులకు ఇచ్చిండ్రు. మేము గవర్నమెంట్ను నమ్ముకొని పంట పెట్టుకుంటే మధ్యలో బంజేసిండ్రు. మా పంటలు ఆగమైనయ్’ అని 15 వందల ఎకరాలు చూపెట్టింది. నేను వస్తున్నానని పేపర్లలో వార్తలు రాగానే కాల్వలల్లో తెల్లారిందాక నీళ్లు వదిలారు. మొన్న నీళ్లు విడువడం ఎందుకు? ఓ 15 రోజుల ముందు విడిస్తే బాగుండు కదా. చివరి రెండు తడులు లేక ఎండిపోయిన పంటలుండె కదా..
నేడు యాడ పండుకున్నరు
ఏది ఏమైనా, రణరంగమైనా సరే ఈ ప్రభుత్వం మెడలు వంచుతాం. మేము రూ.పదివేల నష్టపరిహారం ఆనాడు ఇచ్చాం. ఇన్స్టంట్గా ప్రకటించి రూ. 500 కోట్లవరకు పంచినం. మేము ఆనాడు రూ. 10వేలు నష్ట పరిహారం ఇస్తే దాన్ని కూడా ఎకసెక్కం చేసి మాట్లాడినారు. ఏ మూలకి సరిపోద్ది పదివేలు, రూ. 20వేలు ఇవ్వాలి అని మాట్లాడినారు. మరి ఇయ్యాల యాడ పండుకున్నరు. తలకాయ ఎక్కడ పెట్టుకున్నరు. ఏమి చేస్తున్నరు’ అని కేసీఆర్ ప్రశ్నించారు.