హైదరాబాద్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టి ఆమోదించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇందుకోసం దేశంలోని ప్రతి రాజకీయపార్టీ ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
గతంలో ఢిల్లీ కేంద్రంగా ఎమ్మెల్సీ కవిత చేసిన ధర్నా ద్వారా యావత్ దేశ వ్యాప్తంగా మహిళ రిజర్వేషన్ పై చర్చ జరిగిందన్నారు. ఇప్పటికే ఎంతో మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రజా సేవలో ఉన్నారని, వారి సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. దేశ వ్యాప్తంగా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక సంస్థలు ఎంతో అభివృద్ధి పతంలో నడుస్తున్నాయని వివరించారు.
రానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఒత్తిడి తీసుకురావాలని ఎమ్మెల్సీ కవిత ప్రతి రాజకీయ పార్టీకి లేఖ రాశారని గుర్తు చేశారు. దీనిపై ప్రతి రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళలకు అధిక సీట్లు ఇవ్వలేదని గగ్గోలు పెట్టిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు కేంద్రం బిల్లు ప్రవేశ పెట్టే విదంగా ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విమర్శలు చేయడం తగదన్నారు. మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉంటే భేషరతుగా మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల సాక్షిగా మహిళా రిజర్వేషన్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చిత్తశుద్ది తెలుస్తుందన్నారు.