భువనగిరి అర్బన్, ఏప్రిల్ 13 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీసీ బాలికల హాస్టల్లో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువకముందే మరో హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్పాయిజన్ కావడం కలకలం సృష్టించింది. భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 420 మంది విద్యార్థులు ఉన్న ఈ హాస్టల్లో ఈ నెల 11న రాత్రి క్యాబేజీ, ఎగ్ కర్రీని తిన్న విద్యార్థుల్లో 25 మందికి రాత్రి 11 గంటల సమయంలో వాం తులు, విరేచనాలు అయ్యాయి. కొందరు కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. తోటి విద్యార్థులు పాఠశాల యాజమాన్యానికి తెలుపగా ఉదయం స్కూల్లోనే జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు.
శనివారం ఉదయం వరకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పది మంది విద్యార్థులను మధ్యాహ్నం భువనగిరి ఏరియా దవాఖానలో చేర్పించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇందులో 6వ తరగతి విద్యార్థులు ఎస్ అజయ్కుమార్, సీ రిషిత్, ఎన్ శ్రీవాస్తవ్, 7వ తరగతి విద్యార్థులు టీ కార్తీక్, ఏ అజయ్, బసంత్కుమార్, 8వ తరగతి విద్యార్థులు ఎం యశ్వంత్, పీ జశ్వంత్ భువనగిరి ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం సీహెచ్ ప్రశాంత్, కల్యాణ్ కృష్ణను హైదరాబాద్ ఉప్పల్లోని ఓ ప్రైవేటు దవాఖానకు పాఠశాల యాజమాన్యం తరలించింది. కల్యాణ్ కృష్ణ శనివారం డిశ్చార్చి కాగా ప్రశాంత్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్పారు. శనివారం భువనగిరి దవాఖాన నుంచి ఎస్ అజయ్కుమార్, ఎం యశ్వంత్ను ఉస్మానియా దవాఖానకు తరలించారు. భువనగిరి ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న ఆరుగురి పరిస్థితి నిలకడగానే ఉన్నదని వైద్యులు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే..
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అందుబాటులో లేకపోవడం, వార్డెన్ లేకపోవడం, వంట మనిషి వంటలను ఇష్టానుసారంగా చేయడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రెండు రోజుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వైద్యాన్ని అందిస్తూ విద్యార్థుల ప్రాణాలతో ఆడుకున్నారని, కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే భువనగిరి ఏరియా దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి వేర్వేరుగా పరామర్శించారు. విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారులకు సూచించారు.