Food Poisoning | జనగామ రూరల్, మార్చి 21 : జనగామ జిల్లా కేంద్రం సమీపంలోని పెంబర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో గురువారం ఎనిమిది మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం సుమారు 600 మంది విద్యార్థినులు వంకాయ, సాంబారు, పెరుగుతో భోజనం చేశారు.
అందులో ఐదుగురికి వాంతులు కావడంతోపాటు కడుపు నొప్పితో బాధపడుతుండటంతో సుమారు 7:30 గంటలకు జనగామలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ఇంతలోనే మరో ముగ్గురికి కూడా అలాగే కావడంతో వారిని పసరమడ్ల మాతాశిశు దవాఖానకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం కొంత నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ఆహారం కలుషితం కావడంతోనే ఇలా జరిగిందని పేర్కొన్నారు.