తెలంగాణలో వరిసాగు నిజంగానే పెరిగిందా? అని అనుమానంతో చూసినోళ్లకు.. ఒక్కసారిగా దిగుబడి పెరగడానికి ఏదైనా మ్యాజిక్ చేశారా? అంటూ ఎద్దేవా చేసినోళ్లకు..కాళేళ్వరం, ఇతర ప్రాజెక్టులతో ప్రయోజనం కలుగలేదని కూసినోళ్లకు..రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): మిరుమిట్లు గొలిపేలా వ్యవసాయరంగంలో సాధించిన ప్రగతిని ఆర్బీఐ హ్యాండ్బుక్లో కండ్లకు కట్టింది. తెలంగాణలో కేవలం ఏడేండ్లలోనే వరి దిగుబడి నాలుగు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. మొత్తంగా ఆహార ధాన్యాల దిగుబడి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగింది. వరి, ఆహార ధాన్యాల దిగుబడి వృద్ధిరేటులో తెలంగాణ.. దేశంలోనే ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో నిలిచింది. ముఖ్యంగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కన్నా మూడు రెట్ల వృద్ధిని సాధించడం విశేషం. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ‘హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ 2021-22’లో స్పష్టంగా ఈ విషయాలను వెల్లడించింది. పత్తి దిగుబడి తెలంగాణలో దాదాపు రెట్టింపయిందని, మిగతా పంటల విస్తీర్ణం కూడా పెరిగిందని స్పష్టం చేసింది. ఇందుకు కారణాలు రెండు. వీటిలో ఒకటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు, రెండోది కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం. ఒకప్పుడు నీళ్లు లేక బీడుగా మారిన తెలంగాణ.. నేడు కాళేశ్వరం ఫలితంగా జల తెలంగాణగా మారింది. రైతుబంధు, రైతుబీమా వంటి వ్యవసాయ అనుకూల విధానాలతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఫలితంగా వరి సహా అన్ని పంటల దిగుబడి ఊహించనంత అధికమైంది.
నాలుగు రెట్లు పెరిగిన వరి దిగుబడి
ఆర్బీఐ హ్యాండ్బుక్ ప్రకారం తెలంగాణలో వరి దిగుబడి ఏడేండ్లలోనే నాలుగు రెట్లు పెరిగింది. 2015-16లో వరి దిగుబడి 30.47 లక్షల టన్నులు. 2021-22 నాటికి 1.23 కోట్ల టన్నులకు పెరిగింది. 303% వృద్ధిరేటు సాధించింది. ఇది దేశంలోనే అత్యధికం. పప్పు దినుసుల దిగుబడి సైతం రెట్టింపయ్యింది. 2015-16లో 2.39 లక్షల టన్నులు ఉండగా.. నిరుడు 5.40 లక్షల టన్నులకు పెరిగింది.
గుజరాత్ కన్నా ట్రిపుల్ వృద్ధి
ఆహార ధాన్యాల దిగుబడి వృద్ధిలో తెలంగాణ దేశంలోని మరే రాష్ర్టానికి అందనంత ఎత్తులో నిలిచింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా పలు రెట్లు అధిక వృద్ధిని సాధించింది. వరి దిగుబడిలో తెలంగాణకు, బీజేపీ రాష్ర్టాల వృద్ధికి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా. 2015-16, 2021-22 మధ్య ఆహార ధాన్యాల దిగుబడి వృద్ధిలో తెలంగాణ 194%తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ కేవలం 60% వృద్ధి సాధించగా, కర్ణాటక కేవలం 1.37% వృద్ధిని కనబరిచింది.
కేసీఆర్ సంకల్పం, కాళేశ్వరం.. కాకతీయ ఫలం..
తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటల దిగుబడిలో రికార్డు స్థాయి వృద్ధి సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమ పద్ధతిలో తీసుకున్న నిర్ణయాలే కారణమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం మూడున్నరేండ్లలోనే పూర్తిచేసి దాని కింద ఉన్న అన్ని గ్రామాలకు నీళ్లు పారించారు. గోదారమ్మ పొంగి వచ్చేనాటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి, పటిష్ఠం చేశారు. దీంతో గంగమ్మను చెరువులు ఒడిసిపట్టాయి. ఫలితంగా భూగర్భ జలాలు విపరీతంగా పెరిగాయి. మరోవైపు సాగుపై ఆశ కోల్పోయిన రైతులను వ్యవసాయం చేసేలా ప్రేరణ ఇచ్చేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. ఈ చర్యలకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్తు తోడవడంతో బీళ్లుబారిన భూములన్నీ నీళ్లతో నిండాయి. తెలంగాణ చేలల్లో సమృద్ధిగా పంటలు పండాయి. తద్వారా ఆహార ధాన్యాల వృద్ధిలో ఏడేండ్లలోనే దేశంలోని ఏ రాష్ర్టానికీ అందనంత ఎత్తులో తెలంగాణ నిలిచింది.
మూడు రెట్లు పెరిగిన ఆహార ధాన్యాల దిగుబడి
తెలంగాణలో ఏడేండ్లలో ఆహార ధాన్యాల ఉత్పత్తి మూడు రెట్లు పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. ఏడేండ్ల కిందట 51.29 లక్షల టన్నుల దిగుబడి ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 1.50 కోట్ల టన్నులకు పెరిగిందని ఆర్బీఐ హ్యాండ్బుక్ కొనియాడింది. ఇది దేశంలోనే అత్యధికం కావడం గమనార్హం. తెలంగాణ సుమారు 194% వృద్ధిరేటు సాధించింది.
వాణిజ్య పంటలూ పెరిగాయ్..
తెలంగాణలో ఆహార పంటలతోపాటు వాణిజ్య పంటల దిగుబడి సైతం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా పత్తి దిగుబడి దాదాపు రెట్టింపయ్యింది. చెరుకు, నూనెగింజల ఉత్పత్తి సైతం బాగానే పెరిగిందని ఆర్బీఐ హ్యాండ్బుక్లోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పత్తి దిగుబడి 36.61 లక్షల టన్నుల నుంచి 60.67 టన్నులకు పెరిగింది.
నూనెగింజల ఉత్పత్తి 4.96 లక్షల టన్నుల నుంచి 6.97 లక్షల టన్నులకు చేరింది.
చెరుకు ఉత్పత్తి 24.05 లక్షల టన్నుల నుంచి 28.51 లక్షల టన్నులకు వృద్ధి చెందింది.