రైతుబంధు, బీమా ఫలమిది..
మిషన్ కాకతీయ ఫలితమిది..
కాళేశ్వర జలాల ప్రసాదమిది..
24 గంటల కరెంటు ప్రభావమిది..
చేన్లలో వరికంకులు మొలిచినయ్..
రైతన్న ఇంట్లో సిరులు కురిసినయ్..
తెలంగాణ అన్నం గిన్నె అయ్యింది!
దేశానికే అన్నపూర్ణగా మారింది!!
Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): అది 2014.. తెలంగాణ చేయిచాచి అన్నమో రామచంద్రా! అన్న దుస్థితి. సరిగ్గా తొమ్మిదేండ్లకు దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. ఏ రాజకీయ నాయకుడో చెప్పిన మాట కాదిది. భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) అధికారిక గణాంకాలతో సహా నిరూపించిన నిజం. ఇది కదా! ప్రగతి అంటే. ఇది కదా! అభివృద్ధి అంటే. ఇది కదా! సంక్షేమమంటే. అవును! కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయానికి సాటి, పోటీ లేదని మరోసారి నిరూపితమైంది. దేశ వ్యవసాయ రంగానికి తెలంగాణ దిక్సూచిగా నిలిచింది.
దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి వృద్ధిరేటులో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. 2014-15తో పోల్చితే 2021-22 నాటికి తెలంగాణ 11.6 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఈ విషయాన్ని హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్లో ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఉత్పత్తి వృద్ధిరేటులో తెలంగాణ మరే రాష్ర్టానికి అందనంత ఎత్తులో ఉన్నది. విస్తీర్ణం, జనాభాపరంగా పెద్దవైన రాష్ర్టాలూ తెలంగాణకు దరిదాపుల్లో లేవు. వ్యవసాయ రాష్ర్టాలైన పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోనూ ఆహారధాన్యాల వృద్ధిరేటు తక్కువే. తెలంగాణ వృద్ధి రేటు మాత్రం జాతీయ సగటు కన్నా అధికంగా ఉన్నది. జాతీయ సగటు వృద్ధిరేటు 3.228 శాతమే కాగా, తెలంగాణ దాదాపు మూడింతల రెట్టింపు వృద్ధిరేటును నమోదు చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. పాలమూరు రంగారెడ్డి పథకంతో పాలమూరు పచ్చబడింది. ఇలా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణల ఫలితంగా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. 2014లో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి అది ఏకంగా 2.38 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే ఈ తొమ్మిదేండ్లల్లో రాష్ట్రంలో ఏకంగా కోటి ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగింది. ఇక ధాన్యం ఉత్పత్తి 2014లో కేవలం 68 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2022-23 నాటికి ఇది 2.5 కోట్ల టన్నులకు చేరింది. అంటే దాదాపు 1.8 కోట్ల టన్నులు పెరిగింది.