హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందుకు పర్యవేక్షణాధికారులను నియమిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీచేశారు. తొలిమెట్టు, లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాంలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో బృందాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రస్థాయిలో 16 బృందాలను నియమించగా, మండల స్థాయిలో నలుగురు నుంచి ఆరుగురు అధికారులతో పర్యవేక్షణ బృందాలుంటాయి. ఉన్నత పాఠశాలు, ప్రాథమిక పాఠశాలలకు వేర్వేరుగా పర్యవేక్షణాధికారులను నియమించారు. వీరు ఎస్సెస్సీ ఫలితాల మెరుగు, బోధనాభ్యసన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు.