హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖ వనరుల పెంపుదలపై దృష్టి సారించాలని గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సమానమైన పని పంపిణీ జరిగేలా విభాగాన్ని క్రమబద్దీకరించాలని సూచించారు.
బుధవారం సచివాలయంలో అధికారులతో మంత్రి సమావేశమై రిజిస్ట్రేషన్ శాఖ (Registration )పనితీరును సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా త్వరితగతిన, పారదర్శకంగా నాణ్యమైన రిజిస్ట్రేషన్ సేవలను అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణాన్ని ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, అదనపు ఐజీ వెంకట్ రాజేష్, జాయింట్ ఐజీ శ్రీనివాసులు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల డిప్యూటీ ఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.