Vote | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనతతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తకువగా నమోదైందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్రాజ్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, సీఈవో కార్యాలయం నుంచి హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల సీఈవోలను ఉద్దేశించి రాజీవ్కుమార్ మాట్లాడుతూ.. తకువ శాతాలు నమోదు కావడానికి ఏదైనా నిర్దిష్ట సమస్య ఉంటే కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హైదరాబాద్ గురించి ప్రజెంటేషన్ ఇచ్చారు. యువకుల ఉదాసీనత, రోజువారీ వేతనాలు పొందేవారు పోలింగ్ రోజున సెలవు ప్రకటించినప్పటికీ పనికి వెళ్లడం, ఒకే కుటుంబంలోని ఓటర్లను వేర్వేరు బూత్లకు కేటాయించడం, అంతర్గత వలసలు, క్యూలో వేచి ఉండటమే తకువ ఓటింగ్కు కారణమని చెప్పారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు విస్తృతంగా ప్రచారంతోపాటు పౌరులను భాగస్వాములను చేస్తామని తెలిపారు.
దేశంలో తక్కువ ఓటింగ్ నమోదవుతున్న నియోజకవర్గాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తక్కువ ఓటింగ్ శాతం నమోదైన టాప్ 50 లోక్సభ నియోజకవర్గాలను గుర్తించింది. 2019లో దేశవ్యాప్తంగా సగటు ఓటింగ్ శాతం 67.40 కాగా తెలంగాణలో 62.77 శాతం మాత్రమే నమోదైంది. అతి తక్కువ పోలింగ్ జరిగిన 50 నియోజకవర్గాల జాబితాలో తెలంగాణ నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఓటింగ్ శాతం పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారించారు.