మర్రిగూడ, నవంబర్ 13: ఫ్లోరైడ్ మహమ్మారితో పోరాటం చేస్తూ.. తనదైన శైలితో అద్భుతమైన చిత్రాలను గీస్తూ యువతకు ఆదర్శంగా నిలిచింది సువర్ణ. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఖుదాభక్ష్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సాయిబండ తండాకు చెందిన ఫ్లోరోసిస్ బాధితురాలు రమావత్ సువర్ణ (25) ఆదివారం గుండెపోటుతో మృతి చెందింది.
కదలలేని స్థితిలో కూడా సువర్ణ ఆత్మవిశ్వాసంతో చిత్రాలను గీసింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితతోపాటు పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తల చిత్రాలను గీసి అబ్బురపరిచింది. 2017లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ద్వారా సువర్ణ ప్రతిభను వెలుగులోకి తీసుకురాగా.. ప్రవాస భారతీయులు ఆమె నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించారు.