నల్లగొండ : సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో చేపట్టిన మిషన్ భగీరథ పథకంతో మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం మటుమాయం అయిందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు.
మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో నేరుగా లబ్ధిదారుల ఇంటికే వెళ్లి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి పంపిణీ చేశారు.
అనంతరం కిష్ణాపురం వేణుగోపాల స్వామి ఆలయ పాలక వర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడి నుంచి చండూర్ మండల కేంద్రానికి చేరుకొని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
అనంతరం కోటమైసమ్మ తల్లి మూడో వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఎంతో దార్శనికతతో నిర్మించిన మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణలో కరువు అన్నదే రాదన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల్లా ముందుకు పోతున్నాయని ప్రశంసించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జెడ్పీటీసీ స్వరూప, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.