Heavy Rains | వరంగల్, జూలై 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూపాలపల్లి టౌన్ : మోరంచపల్లి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 12 కిలోమీటర్ల దూరంలోని ఓ ఊరు. వారం నుంచి రోజూ వానలు పడుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఆ ఊరి జనం బుధవారం రాత్రి పనులు ముగించుకొని నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత అలజడి.. ఇండ్లలోకి నీళ్లు వచ్చిన సప్పుడు. మంచాల మీద పడుకొన్న వారికి నీళ్ల అలికిడి. కింద పడుకొన్న వారికి తడి స్పర్శ. ఇండ్లు కురవడమో, దర్వాజ లేదా కిటికీలనుంచి జల్లు రావడమో జరిగిందని అనుకొన్నారు. అయితే.. నీటి స్పర్శ, సప్పుడు అదే తీరుగా ఉన్నది. సమయం గడుస్తున్నా కొద్దీ ఇంకా పెరుగుతున్నది. అర్ధరాత్రి మబ్బులతో ఉన్న ఆకాశం.. కరెంటు లేదు. చిమ్మ చీకటి. ఆందోళనలో ఒకరికి ఒకరు మాట్లాడుకొనే పరిస్థితి లేదు. తమ ఇంట్లోనేనా ఈ సమస్య అనే ఆందోళన. తేరుకొని చూస్తే గుండెలు పగిలినంత పనైంది. పిల్లలు, వృద్ధులు ఉన్న ఇండ్లలోని వాళ్లకు ఆపుకోలేని దుఃఖం. కొందరు తేరుకొన్నారు. ధైర్యం చేశారు.
ఒక్కొక్కరుగా అందరూ ఇండ్లపైకి చేరుకొన్నారు. పెంకుటిల్లు, గుడిసెవాసులు పక్కనే ఉన్న డాబాలపైకి ఎక్కారు. గ్రామ సర్పంచ్ లకిడె కమలాభాయివెంకన్నతోపాటు కొందరు అక్కడి పరిస్థితిని ఫోన్లలో తెలిసిన వారికి సమాచారం అందించారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి వీడియో పంపి. పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎవరైనా వచ్చి సహాయం చేస్తారేమోనని అందరికీ ఫోన్లు కొడుతుండగా.. సెల్ఫోన్ సిగ్నల్స్ పోయాయి. తెల్లవారుతుండగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా, ఎస్పీ కరుణాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి జోరు వానలో హుటాహుటిన మోరంచవాగు వద్దకు చేరుకొన్నారు. అప్పటికే మోరంచపల్లి గ్రామం చుట్టూ కిలోమీటర్ల పొడవున ప్రవాహం ఉండడంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితి. మోరంచపల్లి గ్రామ పరిస్థితిని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించారు. ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపించేలా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారిని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సహాయక చర్యలు
సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ కేంద్ర అధికారులతో మాట్లాడి రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపించారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తుల నివారణ, అగ్నిమాపక సిబ్బంది.. మోరంచవాగు వద్దకు చేరుకొన్నారు. పడవ సహాయంతో మోరంచవాగులో నుంచి గ్రామానికి చేరుకొని ఒక్కొక్కరిని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. గ్రామానికి చెందిన సుమారు 900 మందిని గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాంధీనగర్లోకి సీఎస్ఐ పాఠశాలకు తరలించారు. ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించారు. నైన్పాక-నేరేడుపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మిస్తున్న ఆరుగురు కార్మికులు మోరంచవాగులో చిక్కుకోగా, వారిని హెలికాప్టర్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు.
నలుగురి ఆచూకీ గల్లంతు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో మోరంచవాగు ఉప్పొంగింది. గణప సముద్రం సైతం పొంగిపొర్లడంతో బుధవారం అర్ధరాత్రి మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ఊరిని చుట్టుముట్టి..ఇండ్లలోకి చేరడంతో గ్రామస్తులు ప్రాణాలు కాపాడుకొనేందుకు ప్రయత్నించారు. ఈ ప్రక్రియలో గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మ, గంగిడి సరోజన, గడ్డం మహాలక్ష్మి రాత్రికి రాత్రే వరదల్లో కొట్టుకుపోయారు. ఎంత గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తెల్లవారాక గ్రామంలోని చెంచుకాలనీలో ఉన్నట్టు సమాచారం అందుకొని అక్కడి వెళ్లి గాలింపు చేపట్టారు. వారి ఆచూకీ లభించలేదు. పిల్లోనిపల్లి సమీపంలో చెల్పూరుకు చెందిన జోగుల సంజీవ్ వరదలో చిక్కుకొని మృతిచెందాడు.
గండ్ర జ్యోతి మేడమ్ భరోసా
రాత్రి 2 గంటలకు ఏదో సప్పుడైంది. లేచి చూస్తే అప్పటికే బయట ఉన్న బైక్ కొట్టుకుపోంది. నీళ్లు ఇంట్లోకి వచ్చాయి. అందరం పక్కనే ఉన్న బంగ్లాపై ఎక్కినం. నా భర్త ఫోన్లో సిగ్నల్ రావడంతో మా నాన్నకి, అధికారులకు ఫోన్చేశాం. చూ స్తుండగానే ఊరంతా మునిగిపోయింది. రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపాం. తెల్లవారాక సిబ్బంది పడవల్లో వచ్చి రోడ్డు మీదకు తీసుకువచ్చారు.
– మరిపెద్ది నవ్యరెడ్డి, మోరంచపల్లి
బతికి బయటపడతమనుకోలే..
ఊళ్లోకి పెద్ద ఎత్తున వచ్చిన నీటిలో నుంచి బయటపడతమనుకోలే. అందరం ఇంటి మీదకి వెళ్లాం. కొంతసేపటికే స్లాబ్దాకా నీళ్లు వచ్చాయి. వరదలో కొట్టుకుపోతం అనుకున్నం. తెల్లారేదాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నం. తెల్లవారినంక వర్షం తగ్గడం, పడవల్లో అధికారులు రక్షించడానికి రావడం చూసి ధైర్యం వచ్చింది. పడవల ద్వారా మోరంచవాగు దాటి బతికిబయట పడ్డాం.
– కూర విజయ, మోరంచపల్లి