హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): కృష్ణా బేసిన్లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బరాజ్లు పూర్తిస్థాయి సామర్థ్యం మేరకు నిండిన అనంతరం నదిలో జలాలు పొంగితేనే వరద జలాలుగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) స్పష్టం చేసింది. మిగులు జలాల పంపిణీ అంశంపై ఇటీవల ఆర్ఎంసీ సమావేశమైన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా వరద జలాల నిర్ధారణపై ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నది. కృష్ణా బేసిన్కు వచ్చే ప్రతి నీటి చుక్కను లెక్కించాలని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేదాకా అనుమతి లేకుండా బేసిన్లో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించవద్దని సమావేశంలో తెలంగాణ బలంగా వాదనలు వినిపించింది. ఇందుకు కమిటీ సైతం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ప్రాజెక్టులన్నీ నిండిన తర్వాత పొంగిపొర్లిపోయే జలాలనే వరద జలాలుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఆర్ఎంసీ ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. దానిని కేఆర్ఎంబీకి సమర్పించిన అనంతరం ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆర్ఎంసీ తదుపరి సమావేశం ఈ నెల 17న నిర్వహించే అవకాశమున్నది.