నిజామాబాద్ : ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్దమొత్తంలో వరద నీరు పోటెత్తడంతో మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అంతర్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సాలూర వద్ద పురాతన వంతెనకు సమాంతరంగా మంజీరా నది ప్రవహిస్తోంది. దశాబ్దన్నర కాలం తర్వాత మంజీరాలో ఈ స్థాయిలో ప్రవాహం కనిపించడం రికార్డు అని స్థానికులు చెబుతున్నారు.
సింగూరు ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడం మూలంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా 11 గేట్ల నుంచి దిగువకు 70వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఫలితంగా మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలకళ సంతరించుకున్న మంజీరా నదిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.