Lakshmi Barrage | మహదేవపూర్ : లక్ష్మీ బరాజ్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువన ఉన్న మహారాష్ట్రలోని ప్రాణహిత నది ద్వారా బుధవారం బరాజ్కు 1,23,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో బరాజ్లోని 84 గేట్లకు గాను ప్రస్తుతం 36 గేట్లు ఎత్తి 1,29,260 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. బరాజ్ నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 13.36 టీఎంసీల నీరు నిల్వ ఉందని, ప్రస్తుత నీటి మట్టం బరాజ్ రివర్ బెడ్ నుంచి 11.1 మీటర్లుగా ఉందని ఆయన వెల్లడించారు.
త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతుండడంతో ప్రాణహిత నది పొంగి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి వరద ఎక్కువగా వస్తోంది. బుధవారం 1.30లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పుష్కరఘాట్ అనుకొని పారుతుండగా రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.