హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కర్ణాటక, మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటినిల్వ మట్టానికి చేరుకోగా, దిగువకు వరదను విడుదల చేస్తున్నారు.
దీంతో శ్రీశైలానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రానికి 46 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. మరోవైపు గోదావరిలోనే కాకుండా, ప్రాణహితలోనూ వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. వెరసి భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం సాధారణ స్థితికి చేరుకున్నది.