కడెం: కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ఉధృతి తగ్గడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన భారీ వర్షాలతో ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. అయితే ఇన్ ఫ్లోకు తగినగట్లుగా ఔట్ ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు కట్టలపైనుంచి వరద ప్రవహించింది. దీంతో ప్రాజెక్టుకు ఎప్పుడు ఏమవుతుందోనని అంతా ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతానికి వరద శాంతించడంతో ప్రాజెక్టుకు ప్రమాదం తప్పింది.
భారీ వరదల నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రాజెక్టు వద్ద ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని, ప్రాజెక్టును కాపాడేందుకు మానవ ప్రయత్నాలు అన్ని చేశామని అన్నారు. ఎట్టకేలకు వర్షాలు తగ్గడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా లేదని చెప్పారు.
ప్రజలు ఆందోళన చెందవద్దని, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. వరద ఉధృతి మరింత తగ్గే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే మొత్తంలో వరద దిగువకు వెళ్తున్నదని చెప్పారు. మొత్తం 17 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నామన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్ననామని, వరద ఉధృతిని బట్టి క్రమంగా గేట్లను దించేస్తామని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ అధికారులు సమర్థవంతంగా పనిచేశాని అభినందించారు.