Godavari | భద్రాచలం వద్ద గోదావరి నదిలో ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 52.2 అడుగులు ఉన్నది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఎత్తివేశారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. ఇంకా వరద కొనసాగుతుండడంతో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు గోదావరి నదిలో వరదను పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులకు భారీగా వరద పోటెత్తింది.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్ఫ్లో సైతం తగ్గుతున్నది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ఫ్లో 8,100 క్యూసెక్కులు వస్తున్నది. అవుట్ ఫ్లో 8100 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 83.81 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90టీఎంసీలు. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి సైతం ప్రవాహం తగ్గింది. ఇన్ఫ్లో 4800 క్యూసెక్కులు ఉండగా.. అదే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు.
నీటి నిల్వ సామర్థ్యం 17.34 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలుగా ఉన్నది.