Warangal | నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 28: బుధవారం రాత్రంతా ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పోటెత్తిన వరద ఓరుగల్లు నగరంలో విధ్వంసం సృష్టించింది. హనుమకొండ, వరంగల్ నగరాల్లో తీవ్ర నష్టం మిగిల్చింది. గ్రేటర్ వరంగల్లోని ఎన్టీఆర్నగర్, బీఆర్నగర్, ఎస్ఆర్ఆర్తోట, హంటర్రోడ్డు, గోపాల్పూర్, జవహర్నగర్, సంతోషిమాత కాలనీ, సమయ్యనగర్, చిన్నవడ్డేపల్లి, కీర్తినగర్, మర్రివెంకటయ్యకాలనీ, వీవర్స్కాలనీ, సీఆర్కాలనీ, లోతుకుంట, సాయినగర్, బృందావన్కాలనీ, రాజీవ్ కాలనీ, రామన్నపేట, మైసయ్యనగర్, రఘునాథ్కాలనీల్లో వరద తీరని నష్టం మిగిల్చింది. మెజార్టీ కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. వరదతో పాటు కొట్టుకొచ్చిన చెత్తంతా వీధులు, ఇండ్లలో చేరింది. రోడ్ల వెంట ఎక్కడ చూసి గుర్రపు డెక్క కుప్పలు తెప్పలుగా పోగైంది. రోడ్లవెంట షాపుల్లో వరద పోటెత్తి తీరని నష్టం వాటిల్లింది. వరంగల్-కరీంనగర్ రోడ్డు, హంటర్రోడ్డు, జవహర్కాలనీ, నయీంనగర్ రోడ్లన్నీ పాడయ్యాయి. ఇండ్లలో గృహోపకరాలు, బియ్యం, ఇతర వస్తువులు పనికిరాకుండా పోయాయి. రోడ్ల వెంట నిలిపిన వాహనాలు వరద తాకిడికి కొట్టుకుపోయి దెబ్బతిన్నాయి. కొన్నిప్రాంతాలను వరద వీడినా బురద పేరుకుపోయి అడుగుతీసి అడుగేయకుండా మారాయి. గ్రేటర్ పరిధిలో మొత్తం 43 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన 3వేల మందికి పైగా ఆశ్రయం కల్పించారు.
కొండాయి.. కన్నీరు మున్నీరు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జంపన్నవాగు ఉధృతంగా ప్రవహించి ఎన్నడూ లేని విధంగా మేడారం గద్దెల వరకు వరద నీరు చేరింది. జంపన్నవాగు వరదల కారణంగా ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామం మొత్తం నీట మునిగింది. వరదల ప్రారంభ సమయంలో గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న క్రమంలో 8మంది గల్లంతుకాగా, వారి మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శుక్రవారం కొండాయికి చేరుకొని బాధితులను చిన్నబోయినపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. గ్రామస్థులకు హెలికాప్టర్ ద్వారా ఆహారం, మంచినీళ్లు, మందులు అందించారు.
మోరంచపల్లిలో ఆర్తనాదాలు
మోరంచవాగు ఉగ్రరూపం.. మోరంచపల్లికి కన్నీరు మిగిల్చింది. కనీవినీ ఎరుగని నష్టాన్ని కండ్ల ముందు నిలిపింది. ఊరిలోని ఏ ఇల్లు చూసినా పనికొచ్చే వస్తువు కనిపించడం లేదు. క్వింటాళ్ల కొద్దీ బియ్యం, పత్తి బస్తాలతో పాటు కూలర్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సర్వం నీటిపాలయ్యాయి. వాగు శాంతించడంతో పునరావాస కేంద్రాల నుంచి గ్రామస్థులు ఇండ్లకు చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. మోరంచపల్లి గ్రామస్థులకు కర్కపల్లి పాఠశాల, గాంధీనగర్లోని సీఎస్ఐ పాఠశాలలో అధికారులు ఆశ్రయం కల్పించారు. వరద నేపథ్యంలో తలెత్తిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని, అప్పటివరకు ఇక్కడే ఉండాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బాధితులకు భరోసానిచ్చారు.
కొంపముంచిన ఐదు చెరువులు
ఐదు చెరువులకు గండి పడటంతో మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లి నీట మునిగింది. వెంకటాపూర్ మండలం బూరుగుపేట చెరువు, గణపురం మండలం కొండాపూర్ వద్ద గల చిర్ర చెరువు, ధర్మారావుపేట వద్ద గల ఊరచెరువు, కర్కపల్లి వద్ద గల సబ్బిడికుంట, భూపాలపల్లి మండలం పెద్దాపూర్ వద్ద గల ఎర్ర చెరువులకు గండిపడిందని, దీంతోనే మోరంచవాగు ఉప్పొంగి మోరంచపల్లిని వరద చుట్టుముట్టిందని ఐబీడీఈ ప్రసాద్ తెలిపారు.