హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవిష్కరణ విమానయాన సంస్థలకు వరంగా మారింది. యాగం, పార్టీ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంతోపాటు సీఎం కేసీఆర్ను కలిసి మద్దతు ప్రకటించేందుకు వివిధ రాష్ర్టాల నుంచి నాయకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి వేలాది మంది నేతలు ఢిల్లీకి వెళ్తున్నారు. దీంతోపాటు ఉత్తరాదిన వివాహాల జోరు పెరిగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్-ఢిల్లీ మధ్య ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఈ డిమాండ్ను విమానయాన సంస్థలు సొమ్ము చేసుకొంటున్నాయి. ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తి కావడంతో తిరిగి వచ్చేందుకు విమాన టికెట్ల కోసం ప్రయత్నిస్తున్న నేతలు షాక్ తింటున్నారు. రేట్లు దాదాపు రెట్టింపు కావడంతో ఖంగుతింటున్నారు. సాధారణంగా హైదరాబాద్, ఢిల్లీ మధ్య టికెట్ రేటు రూ.7 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుంది. కానీ, ఇప్పుడు ధర ఏకంగా అనేక రెట్లు పెరిగింది. కొన్ని సంస్థలు రూ.30 వేల వరకు వసూలు చేయగా, మరికొన్నింటిలో రూ.40 వేలకుపైగా కనిపించింది. ఒక విమానయాన సంస్థ అయితే ఏకంగా రూ.70 వేలు వసూలు చేసినట్టు తెలిసింది.