హైదరాబాద్: వచ్చే నెల 2న ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్లో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వెలిసాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా హోర్డింగ్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
బైబై మోదీ అనే హాష్ ట్యాగ్తో టివోలీ థియేటర్ ఎదురుగా భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇందులో రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపినవ్, నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే అని యువత కడుపు కొట్టినవ్, హఠాత్తుగా లాక్డౌన్ అని గరీబోల్లను చంపినవ్, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేసినవ్, పెద్ద నోట్ల రద్దని సామాన్యుల నడ్డి విరిచావ్ అని, నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు ఏవని ప్రశ్నించారు. అయితే ఈ ఫ్లెక్సీలు, హోర్డింగ్లను ఎవరు ఏర్పాటుచేశారనే విషయం తెలియాల్సి ఉన్నది.
ప్రధాని మోదీ గత నెల హైదరాబాద్లోని ఐఎస్బీకి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణకు ఏంచేశాని ప్రశ్నిస్తూ.. 17 ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లను కొందరు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాటిని గచ్చిబౌలిలోని ఐఎస్బీ పరిసరాలతోపాటు ప్రధాని ప్రయాణించిన వివిధ మార్గాల్లో ఏర్పాటు చేశారు.