హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో లోపాల మీద లోపాలు వెలుగు చూస్తున్నాయి. లెక్చరర్లు పిల్లల్లా గుంపులు గుంపులుగా కూర్చుని పేపర్లు మూ ల్యాంకనం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు ముగియడం తో జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతున్న ది. పలు జిల్లాల్లో మూల్యాంకన క్యాంపులు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపుల్లో సరైన వసతుల్లేవు. కనీసం కూర్చునేందుకు బెంచీలు(డ్యూయల్ డెస్క్) కూడా లేవు. మహబూబ్నగర్ జిల్లాలోని మూల్యాంకన క్యాంపులో లెక్చరర్లు అంతా నేలమీదే కూర్చుని పేపర్లు దిద్దుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు లెక్చరర్లు కారిడార్, బాల్కనీల్లో గోడల మీద పేపర్లు పెట్టి మూల్యాంకనం చేస్తున్న చిత్రాలు సోషల్మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం కీలకమైన బాటనీ, జువాలజీ, కామర్స్ పేపర్లు వాల్యుయేషన్ చేయించగా అనేక లోపాలు వెలుగుచూశాయి.
జవాబు పత్రాల మూల్యాంకనం గందరగోళంగా సాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో అధికారులు ఆటలు ఆడుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. హడావుడిగా వాల్యుయేషన్ చేయిస్తున్నారని, విచ్చలవిడితనానికి పరాకాష్టగా మారిందని అంటున్నారు. ఈ నెల 17 నుంచి అన్ని క్యాంపుల్లో 30 పేపర్లకు బదులు రోజుకు 45 పేపర్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు.
మూల్యాంకన కేంద్రాల్లో వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. ఈ రోజు ఎంత మంది వస్తారు.. ఎన్ని బెంచీలు, కుర్చీలు అవసరమన్న అంశాలు పరిగణనలోకి తీసుకోకుండా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. వసతులు సరిగ్గా లేకపోతే లెక్చరర్లు పేపర్లను సక్రమంగా మూల్యాంకనం చేయకపోతే దీని ప్రభావం ఫలితాల మీద పడుతుంది. పకడ్బందీగా పేపర్ల మూల్యాంకనం అంటే ఇదేనా..? అని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. విద్యార్థులు ఫెయిలైతే.. బాధ్యులెవరు అని నిలదీస్తున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం గర్హనీయమని మండిపడుతున్నాయి. అధికారులు చొరవ తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.