హైదరాబాద్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద కారు – బస్సు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. చౌటుప్పల్ పరిధి దివిస్ ల్యాబ్స్ వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు.
మరో వ్యక్తి గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను వెలిమినేడులోని రసాయన కంపెనీ ఉద్యోగులుగా గుర్తించారు. పండుగ పూట కుటుంబీకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో తీరని విషాదం అలుముకున్నది. ఆయా ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.