తెలంగాణ నేలన పద్మాలు విరిసాయి. ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి పద్మ విభూషణ్ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 132మందికి కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులను పద్మశ్రీ వరించింది. బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్తోపాటు యాదాద్రి ఆలయ శిల్పకారుడు ఆనందాచారి పద్మశ్రీ అందుకోనున్నారు.
Padma Shri Awards | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ)/దామరగిద్ద/దేవరుప్పుల: తెలంగాణ రాష్ర్టానికి చెందిన ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. నారాయణపేట జిల్లాకు చెందిన ‘బుర్రవీణ’ కళాకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన ‘చిందు యక్షగాన’ కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారికి పద్మ పురస్కారాలు దక్కాయి. సాహిత్యరంగంలో ప్రముఖ సాహితీవేత్త, ఇంటినే గ్రంథాలయంగా మార్చిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కూరెళ్ల విఠలాచర్య, ఇదే జిల్లాకు చెందిన కేతావత్ సోమ్లాల్ను పద్మశ్రీ వరించింది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప అద్భుతమైన కళా నైపుణ్యంతో తెలంగాణ సంస్కృతి కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. పద్మశ్రీ అవార్డులకు చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప ఎంపిక కావడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్ప తంత్రి వాద్యమైన బుర్రవీణ కళాకారుడు. చాలా ప్రాంతాల్లో బుర్రవీణ వాయించి పలువురిని అలరింపజేస్తున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల మన్నలను పొందారు. బలగం సినిమాలో ఒక పాట పాడటంతో రాష్ట్రవ్యాప్తంగా కొండప్ప ఫేమస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో, రాజ్భవన్లో, తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కొండప్పను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఆయన కుమారుడు రాములు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొండప్ప పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా వాసులు, గ్రామస్థులు హర్షం ప్రకటించారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్య అంతరించిపోతున్న జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య ఆరో తరగతి వరకు చదివారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య సభ్యుడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. సమ్మయ్య బృందం దేశవ్యాప్తంగా 25,000 ప్రదర్శనలు ఇచ్చింది. 1991 నుంచి హైదరాబాద్ దూరదర్శన్లో 150 ప్రోగ్రాంలు ఇచ్చారు. సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు.
తెలుగు రచయిత, విశ్రాంత ఉపన్యాసకుడు, సామాజికవేత్త, గంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నెముల గ్రామం. సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని సుమారు రెండు లక్షల పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చారు. ఆదివారం రేడియో కార్యక్రమంలో మన్కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ కూరెళ్ల గురించి ప్రస్తావించారు. పట్టుదల ఉంటే వయస్సులో సంబంధం లేదని కూరెళ్ల నిరూపించారని మోదీ ప్రశంసించారు. కూరెళ్లకు భార్య జమున, ముగ్గురు కుమార్తెలు నర్మద, తపతి, సరస్వతి ఉన్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లికి చెందిన శిల్పకారుడు వేలు ఆనందాచారి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా పనిచేశారు.
బంజారాల కోసం భగవద్గీత అనువాదం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ను సాహిత్య, విద్యారంగంలో విశేష సేవలు అందించారు. ఈయన బంజారాలకు అర్థమయ్యేలా భగవద్గీతను మలిచారు. 16 నెలలపాటు అవిశ్రాంతంగా కృషిచేసి భగవద్గీతలోని 701 శ్ల్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. బంజారా జాతి జాగృతి కోసం 200కుపైగా పాటలు రాశారు.