ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన రంగంలో మరొక ప్రముఖ కంపెనీ అయిన ఫిస్కర్.. హైదరాబాద్లో ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నది. కొంతకాలంగా తెలంగాణ సర్కారుతో సంప్రదింపులు జరుపుతున్న కంపెనీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. లాస్ ఏంజెల్స్లోని ఆ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సీఈఓ హెన్రీక్ ఫిష్కర్, సీఎఫ్వో గీతా ఫిస్కర్తో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు తెలంగాణనే గమ్యస్థానంగా మారబోతుందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుందని ఫిస్కర్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ వివరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ పాలసీపై చర్చించారు. హైదరాబాద్ కేంద్రంగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయన్నారు. ఇక జడ్ఎఫ్, హుండాయ్లాంటి పలు కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా తమ టెక్ కార్యకలాపాలను నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సమావేశంలో కేటీఆర్ ప్రస్తావించారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టంచేశారు. ఆటో మొబైల్ పరిశ్రమకు సంబంధించిన డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు హైదరాబాద్ లో అద్భుతమైన అవకాశాలున్నాయన్న కేటీఆర్, ఇందుకోసం ప్రత్యేకంగా మొబిలిటీ క్లస్టర్ ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో భాగస్వాములు కావాలని ఫిస్కర్ కంపెనీని కోరారు. మంత్రి కేటీఆర్ వివరించిన అంశాలు, ప్రాధాన్యతలపై ఫిస్కర్ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే మొబిలిటీ క్లస్టర్ లో భాగస్వాములయ్యేందుకు అంగీకరించారు.
తమ ఐటీ, డిజిటల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ప్రపంచంలోని అనేక దేశాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలను కూడా పరిశీలించామని సీఈఓ హెన్రీక్ ఫిష్కర్ చెప్పారు. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూలత, ప్రభుత్వ పారదర్శక విధానాలే హైదరాబాదులో సెంటర్ ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయానికి ప్రధాన కారణమని వెల్లడించారు. ఈ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఆటో మొబైల్, సాఫ్ట్వేర్ రంగాలకు చెందిన 300 మంది టెక్ నిపుణులకు ఉద్యోగావకాశాలు దొరుకుతాయన్నారు. కాగా, ఫిష్కర్ కంపెనీ తయారు చేసిన ఓషన్ మోడల్ ఎలక్ట్రిక్ కారును మంత్రి కేటీఆర్ పరిశీలించారు.
హైదరాబాద్లో ప్రపంచంలోనే క్వాల్కమ్ రెండో అతిపెద్ద కార్యాలయం..
సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ మంగళవారం శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్వో ఆకాష్ పాల్కివాల, ఉపాధ్యక్షుడు జేమ్స్ జిన్, లక్ష్మీ రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్సింగ్తో కూడిన సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో 3904.55 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు క్వాల్కమ్ బృందం తెలిపింది. మంత్రి కేటీఆర్తో తమ పెట్టుబడి ప్రణాళికలను పంచుకుంది. నగరంలో అందుబాటులో ఉన్న, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ పాలసీలు తమ కంపెనీని నిరంతరం తెలంగాణలో విస్తరించేలా ప్రభావితం చేస్తున్నాయని ఈ సందర్భంగా తెలిపింది. రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్ సంస్థ, తమ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్ఎఫ్టీ కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నాటికి హైదరాబాద్ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్ తెలిపింది. ఈ సందర్భంగా క్వాల్కమ్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీలాంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.