ఉమ్మడి పాలనలో చెరువులు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన మత్స్యకారులు రోడ్డున పడ్డారు. ఊరిలో ఉపాధి కరువై.. బతుకు బరువై వలసబాట పట్టిన వారెందరో. స్వరాష్ట్రంలో ఊరి చెరువుకు జీవమొచ్చింది. మిషన్ కాకతీయతో పూర్వవైభవం వచ్చింది. కాళేశ్వరంతో జలసిరులు ఉప్పొంగి నీలి విప్లవం ఎగిసిపడింది. ముదిరాజ్లకు ప్రాణమొచ్చింది. తిరిగి పల్లెబాట పట్టించింది. మండుటెండల్లోనూ ఒడవని నీళ్లు. పట్టవశం గాని చేపలు. చేతినిండా ఉపాధి. జేబునిండా ఆదా యం. స్వరాష్ట్రంలో ముది’రాజు’లు సగర్వంగా జీవనం సాగిస్తున్నారు. సోమవారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): చెరువు బతుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. కానీ, వలస పాలకుల కుట్రల తో చెరువు నిర్లక్ష్యానికి గురైంది. జలదోపిడీకి బలిపశువుగా మారింది. పూడిక చేరి, కట్టలు కరిగి.. నీరు లేకుండా బోసిపోయింది. తెలంగాణ పల్లె బతుకు ఛిద్రమైంది. మత్స్యకారుల జీవనోపాధికి గండికొట్టింది. వలసబాట పట్టించింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణ ఉద్యమ నినాదమైంది. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలుచేపట్టిన వెంటనే కేసీఆర్.. తొలిప్రాధాన్యంగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. రాష్ట్రంలోని 46,531 చెరువుల పునరుద్ధరణకు నడుం కట్టారు. మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టి నవ తెలంగాణకు పునాది వేశారు. ఇప్పటివరకు నాలుగు దశల్లో రూ.9155 కోట్లతో 27,584 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆ చెరువులు పూర్వవైభవం సంతరించుకొని, మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చాయి.
సమైక్య పాలనలో చెరువులు చాలావరకు దెబ్బతిన్నాయి. కొద్దోగొప్పో ఉన్నా.. వాటితో మత్స్యకారులకు ఒరిగింది శూన్యమే. మత్స్యకారులే చేపపిల్లలను కొనుక్కొని చెరువుల్లో పోసుకోవాల్సిన దుస్థితి. ఆర్థిక స్థోమత లేక అనేక సొసైటీలు గుత్తేదారులను ఆశ్రయించేవి. పిల్లలు పెరిగాక సొసైటీకి నామమాత్రపు ధరతో చేపలు పట్టుకుపోయేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితి పోయింది. ప్రభుత్వమే చేపపిల్లలను ఉచితంగా సరఫరా చేస్తున్నది. చేపల ను దళారులకు అమ్మకుండా మత్సకారులే నచ్చిన ధరకు విక్రయిస్తూ బలోపేతమవుతున్నారు.
చేపల అమ్మకానికి ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తున్నది. సమీప పట్టణాలకు వెళ్లి విక్రయించుకునేందుకు బైకులు, ఫోర్వీలర్లను సబ్సిడీపై అందజేస్తున్నది. రూ.7.60 కోట్లతో రాష్ట్రంలో 784 అధునాతన చేపల మార్కెట్లను ఏర్పాటు చేసింది.
చేపల పెంపకాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. చెరువుల పునరుద్ధరణతో 8 టీఎంసీల నీరు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదుల సంఖ్యలో కొత్త రిజర్వాయర్లను నిర్మించడం ద్వారా మరో 136 టీఎంసీల నీరు అందుబాటులోకి రానున్నది. రాష్ట్రంలోని నీటి వనరులపై మత్స్యకారులకే హక్కులను కొనసాగిస్తూ, వారి భాగస్వామ్యంతో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రభుత్వం సమాలోచనలు జరుపుతున్నది. తద్వారా ముదిరాజ్లకు అదనపు ఉపాధి అవకాశాలకు మార్గం ఏర్పడడంతోపాటు, ఆదాయం కూడా రెట్టింపు చేయాలనే దిశగా చర్చలు కొనసాగిస్తున్నది.