BRS MLC Kavitha | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నిండాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ పలు చర్యలు చేపట్టారని తెలిపారు. గురువారం ఆర్మూర్లో జరిగిన గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చెప్పింది చెప్పినట్లు చేసి చూపారన్నారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ అమలు చేసి చూపుతారన్నారు. ఎన్నికల వేళలో ఇతర పార్టీలు వచ్చి మాటలు చెబుతాయని, ఆ మాటలు నమ్మి అటువైపు వెళితే ఇప్పటి వరకూ చేసిందంతా వృధా అవుతుందన్నారు. పట్టు విడువకుండా పోరాడి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చి.. రాష్ట్రం సస్యశ్యామలం చేశారన్నారు. కనుక కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాకముందు, కేసీఆర్ సీఎం కాకముందు మన పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో గమనించాలని ప్రజలను కల్వకుంట్ల కవిత కోరారు. గంగపుత్రులు చాలా పేదరికంతో ఉండేవారని, కాబట్టి గంగపుత్రుల జీవితాల్లో మార్పులు తేవాలని తెలంగాణ ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ ఆలోచించారని చెప్పారు. గతంలో 2000 మత్స్య సంఘాలు ఉంటే, ఇప్పుడు అవి 6000లకు పెరిగాయన్నారు. చెరువుల్లో ప్రభుత్వమే ఉచితంగా చేపపిల్లలను వేస్తున్నదని, గ్రామ పంచాయతీల ఆధీనంలో ఉన్న చెరువులను మత్స్య శాఖకు బదిలీ చేశామని వివరించారు.
మిషన్ కాకతీయ కార్యక్రమం కింద చెరువులు మరమ్మత్తు చేయడం వల్ల నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, చేపల పెంపకం పెరిగిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గంగపుత్రుల గురించి అసెంబ్లీలో గతంలో ఏ సీఎం మాట్లాడలేదని, సీఎం కేసీఆర్ ఒక్కరే గంగపుత్రుల సంక్షేమం గురించి అసెంబ్లీలో మాట్లాడారని పేర్కొన్నారు. పెట్టుబడి సర్కార్ది రాబడి గంగపుత్రులదని చెప్పిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. పలు గ్రామాల్లో గంగమ్మ దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మత్స్యకారుల స్కిల్ టెస్టును సడలించి ఎక్కువ మందికి సభ్యత్వం కల్పించామని, 18 ఏళ్లు నిండిన ప్రతీ గంగపుత్ర బిడ్డకు సభ్యత్వం ఇస్తున్నామన్నారు. మత్య్సకారులకు ప్రభుత్వం రూ. 6 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోందని చెప్పారు.
నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారుల మహిళా సంఘాలు 32 ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్యను 110కి పెంచామని గుర్తు చేశారు. కొన్ని సంఘాలకు రూ. 3 లక్షల మేర గ్రాంట్ ఇచ్చామని, అన్ని సంఘాలకు కూడా ఎన్నికల తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో రూ. 50 లక్షలతో ఫిష్ మార్కెట్ మంజూరు చేస్తామని ప్రకటించారు. బీసీ బంధులో భాగంగా మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిందని, గంగపుత్ర యువత ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వం రూ. 2 కోట్ల వరకు హామీ లేని రుణాలు అందిస్తున్నదన్నారు. బీసీ హాస్టళ్ల సంఖ్యను గణనీయంగా పెంచామని పేర్కొన్నారు.
మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచబోతున్నామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. ఎన్నికలైన వెంటనే రూ. 3 వేలకు పెరుగుతుందని వివరించారు. రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. రూ. 15 లక్షల వరకు ప్రైవేట్ దవాఖానల్లో వైద్య చికిత్స కోసం ఆరోగ్య శ్రీ పథకం కింద బీమా కవరేజీ పెంచుతామన్నారు. సన్నబియ్యం పంపిణీ చేయాలని, సౌభాగ్య లక్ష్మీ పథకం కింద పేద మహిళలకు నెలకు రూ. 3 వేలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారన్నారు. బీడీ కార్మికులందరికీ కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా పెన్షన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల టెన్షన్ లేదని అన్నారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 2000 పెన్షన్ ఇస్తుంటే అందులో రూ. 1200 గ్యాస్ సిలిండర్కే పోతున్నాయని, కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర భారం తగ్గించడానికి సీఎం కేసీఆర్ రూ.400 కే అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఇండ్ల స్థలాలు ఉన్న గల వారు ఇండ్లు నిర్మించుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలు అందిస్తున్నామని వివరించారు.