హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): నిండా మీనాలతో తెలంగాణలో తటాకాలు ‘చేపల చెరువుల’ను తలపిస్తున్నాయి. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఈ ఏడాది విజయవంతంగా పూర్తికావడంతో చెరువులు మత్స్యకళను సంతరించుకొన్నాయి. సుమారు 5 నెలల పాటు సాగిన ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని రకాల జలవనరుల్లో అధికారులు చేప పిల్లలను విడుదల చేశారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.84 కోట్లు వెచ్చించింది. మొత్తంగా ఈ ఏడాది 23,748 చెరువుల్లో 85.32 కోట్ల చేప, రొయ్య పిల్లలను విడుదల చేసింది. 76.80 కోట్ల చేప పిల్లల పంపిణీకి రూ.65 కోట్లు, 8.62 కోట్ల రొయ్య పిల్లల విడుదలకు రూ.21 కోట్లు ఖర్చు చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,005 జలవనరుల్లో 5.60 కోట్ల చేప పిల్లలను విడుదల చేశారు. మెదక్ జిల్లాలో 1,490 జలవనరుల్లో 4.70 కోట్ల చేప పిల్లలు, నిజామాబాద్ జిల్లాలో 984 జలవనరుల్లో 4.58 కోట్ల చేప పిల్లలను వదిలారు.
మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసి, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది వరకు పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.415 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో రూ.350.60 కోట్ల ఖర్చుతో 414.15 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి విడుదల చేసింది. అలాగే, రూ.64.50 కోట్ల ఖర్చుతో 28.47 కోట్ల రొయ్య పిల్లలను జలవనరుల్లో వదిలింది. చేప పిల్లల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో మత్య్సకారులకు సుమారు రూ.27 వేల కోట్ల ఆదాయం సమకూరింది.