రాష్ర్టాలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ లేఖలు
దేశంలో నిరుద్యోగానికి కారణం కాషాయ పార్టీయే
ఆస్తులు అమ్మేవాళ్లా.. సంపద సృష్టించేవాళ్లా
ఎవరు కావాలో మీరే ఆలోచించుకోండి
హుజూరాబాద్లో మంత్రి హరీశ్రావు
హుజూరాబాద్, సెప్టెంబర్ 3: ‘మేం ఆస్తులు అమ్ముతున్నాం.. మీరు కూడా అమ్మండి.. ఏ రాష్ట్రం ఎక్కువగా అమ్ముతుందో వారికి బహుమానాలు ఇస్తాం’ అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లేఖ రాసిందని, బహుమానాల కోసమే రూ.6 వేల కోట్లను కేటాయించిందని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కాళేశ్వరం, యాదాద్రి, భద్రాద్రి లాంటి సాగునీరు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను నెలకొల్పి రాష్ట్రంలో ఆస్తులు పెంచుతుంటే.. బీఎస్ఎన్ఎల్, రైల్వేలు, విమానయాన సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విక్రయానికి పెట్టిందని దుయ్యబట్టారు. జీడీపీ పెంచడమం టే బీజేపీ దృష్టిలో గ్యాస్, డీజిల్, పెట్రోలు ధరల పెంచడమేనని ఎద్దేవాచేశారు. వచ్చే ఉప ఎన్నికలో ఆస్తులు అమ్మేవాళ్లను నమ్మాలో..? ఆస్తులను పెంచేవాళ్లను నమ్మాలో..? మీరే నిర్ణయించుకోవాలని కోరారు. కేసీఆర్ సర్కారు నిరుద్యోగాన్ని రూపుమాపడానికి అనేక చర్యలు చేపడుతుంటే.. ప్రభుత్వ సంస్థలను అమ్ముతూ కేంద్రం నిరుద్యోగాన్ని పెంచుతున్నదని ఆరోపించారు. ఆస్తులను ప్రైవేటీకరణ చేయడంతో అంబేదర్ ఆశయం నీరుగారి పోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
కాళేశ్వరంతో పక్క రాష్ర్టాల కూలీలకు ఉపాధి..
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో పక్క రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారని మంత్రి స్పష్టంచేశారు. గత 9 నెలలుగా కాలువల్లో నిండుగా నీళ్లు వస్తున్నాయని గుర్తుచేశారు. దేశంలో అత్యధిక ధాన్యం పండించే పంజాబ్ను అధిగమించి తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని, 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెట్టేస్థాయికి ఎదిగిందని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇస్తే, కేంద్రం 7.5 శాతం మాత్ర మే ఇచ్చిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ పథకాన్ని అనతికాలంలోనే పూర్తిచేసినట్టు నీతి ఆయోగ్ కమిటీ కితాబు ఇచ్చిందన్నారు. కాబోయే ఎమ్మెల్యే గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల కృషి ఎనలేనిదని, వారి సమస్యలను తప్పకుండా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హరీశ్రావు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, నాయకులు ఇనుగాల పెద్దిరెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగులు బొరగాల రాజయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్లోకి ఈటల ముఖ్య అనుచరుడు లక్ష్మణ్
బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరుడు, కరీంనగర్ జిల్లా ఫిషరీస్ సొసైటీ మాజీ చైర్మన్ పోలు లక్ష్మణ్ శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్కు గులాబీ కండువా కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితుడై పార్టీలో చేరుతున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. హుజూరాబాద్లో ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు భూమ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన 100 మంది ముదిరాజ్ యువకులు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.