హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో 2016-17లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది. నాటి నుంచి నేటి వరకు ఏకంగా 400 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందజేసింది. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ.350 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఆదాయం పెరగడంతో పాటు సుమారు రూ. 26 వేల కోట్ల సంపద సృష్టి జరిగింది.
ఈ ఏడాది రూ.65 కోట్ల ఖర్చు
ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చివరి దశకు చేరుకున్నది. రూ.65 కోట్ల ఖర్చుతో 83 కోట్ల చేప పిల్లలను, రూ. 25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 21 వేల జలవనరుల్లో సుమారు 62 కోట్ల చేప పిల్లలను చెరువుల్లోకి విడుదల చేశారు. వీటిలో 35-40 ఎంఎం చేపలు 42 కోట్లు ఉండగా, 80-100 ఎంఎం పెద్ద చేప పిల్లలు 20 కోట్లు ఉన్నాయి. 3.5 కోట్ల రొయ్య పిల్లలను కూడా ఎంపిక చేసిన నీటి వనరుల్లో విడుదల చేశారు. వారంలో మొత్తం పంపిణీ పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దాదాపు 15 మేజర్ జిల్లాల్లో పంపిణీ పూర్తయింది.
యాప్తో పర్యవేక్షణ.. రూ.12 కోట్లు ఆదా
గతంతో పోల్చితే ఈ ఏడాది వేగంగా, పకడ్బందీగా చేప పిల్లల పంపిణీ చేపట్టారు. టెండర్ల నుంచి మొదలుకొని, చెరువుల్లోకి చేపలు చేరే వరకు ఎక్కడా అవకతవకలు జరగకుండా చర్యలు చేపట్టారు. టెండర్లలో జాగ్రత్తగా వ్యవహరించిన అధికారులు గతంతో పోల్చితే చేప పిల్లల ధర తగ్గేలా చేశారు. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.12 కోట్లు ఆదా అయ్యాయి. పంపిణీలో అవకతవకలను అడ్డుకునేందుకు ఈ ఏడాది కొత్తగా మత్స్యమిత్ర యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. టెండరుదారు చేపల చెరువు నుంచి చేపలను లోడ్ చేయడం నుంచి చెరువులో వేసే వరకు యాప్ ద్వారా పర్యవేక్షించారు.