Telangana | ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లాలో వారం నుంచి కరుస్తున్న వర్షం తెరిపినివ్వడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా వరద కారణంగా చెరువులు, కుంటలు జల కళను సంతరించుకోవడం, చెరువులు మత్తడి దుంకుతుండడంతో ప్రతిచోటా చేపలు పుష్కలంగా దొరుకుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతంతోపాటు మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడంతో మత్స్య సంపదకు కొదువ లేకుండా పోయింది. ఆత్మకూర్.ఎం మండలంలోని చెరువులన్నీ దాదాపు మత్తడి దుంకుతుండగా, ఆయా గ్రామాల ప్రజలు రెండ్రోజుల నుంచి చేపల వేట సాగిస్తున్నారు. శుక్రవారం మండలంలోని ఏ ఇంట్లో చూసినా చేపల కూరే వండడం, పులుసు వాసన ఘుమఘుమలాడింది.