హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు పుట్టారు వాళ్లు. ఉద్యమంతోపాటే ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూశారు. ఉద్యమనాయకుడు కేసీఆర్ అంటే అంతులేని అభిమానం. మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు చేపట్టిన విద్యాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు మొదటిసారి వారికి ఓటు హక్కువచ్చింది.. సారుపై అభిమానాన్ని చాటుకొనే అవకాశమూ వచ్చింది.
తమ మొదటి ఓటు ఎప్పటికీ గుర్తుపెట్టుకునేలా ఉండాలనే అభిలాష, సెంటిమెంట్ వారిని ఊరిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈసారి కొత్తగా 9,99,667 మంది యువతీయువకులు ఓటు హక్కును పొందారు. వారిలో 5,70,274 మంది యువకులు కాగా, 4,29,273 మంది యువతులు, 120 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం నియోజవకర్గంలో 13,599 మంది ఉండగా, అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 2808 మంది ఉన్నారు. ఓటు హక్కు పొందినవారంతా దాదాపు 2000 సంవత్సరం తరువాత పుట్టిన వారే కావడం గమనార్హం. వీరంతా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి సాక్షిభూతాలుగా నిలిచారు. ఇప్పుడు ఈ కొత్త ఓటర్లు తమ తొలిఓటును కేసీఆర్ సారుకే వేయాలని సంకల్పించారు.
సంక్షేమఫలాలు..
కొత్తగా ఓటు హక్కు పొందిన యువతీయువకుల్లో అత్యధికులు ఉన్నతవిద్యనభ్యసిస్తున్నారే. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేండ్ల కాలంలోనే కల్పించిన విద్యా అవకాశాలతో లబ్ధిపొందుతున్నవారే వీరిలో ఎక్కువగా ఉన్నారు. వీరిలో యువతుల సంఖ్య అధికం. గురుకులాల ద్వారా డిగ్రీ, ఇతర వృత్తివిద్యాకోర్సులను అభ్యసిస్తున్నారు. ఐటీ రంగంలో వస్తున్న ఉపాధి అవకాశాలతో కూడా యువతీయువకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో లబ్ధి చేకూరుతున్నది.
ఐటీ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేయడం, హైదరాబాద్కే పరిమితం చేయకుండా జిల్లా కేంద్రాలకు కూడా విస్తరింపచేయడం యువతను ఆకట్టుకుంటున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై సానుకూల దృక్పథాన్ని ఏర్పరుస్తున్నది. యువతులకు విద్యాభ్యాసం కోసం ప్రభుత్వం కల్పిస్తున్న హాస్టల్ సదుపాయాలు ఎన్నో. అదీగాక వివాహాలకు కల్యాణలక్ష్మీ, అటు తరువాత కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి తదితర సంక్షేమ కార్యక్రమాల లబ్ధి పొందిన వారిలో కూడా కొత్త ఓటర్లు ఉన్నారు. ఒకవైపు ఉద్యమనాయకుడు, మరోవైపు సంక్షేమఫలాలు అందుకున్న కృతజ్ఞత ఇలా అన్నివిధాలుగా కొత్త ఓటర్లు కేసీఆర్కే తమ మొదటి ఓటు వేసేలా పురికొల్పుతున్నది.
కాలేజీల్లో డిబేట్లు.. నిర్ణయాలు
మొదటి ఓటును ఎవరికి వేయాలి? అనే అంశంపై పలు ఇంజినీరింగ్, మెడికల్, డిగ్రీ కాలేజీల్లో యువతీయువకులు ప్రత్యేక చర్చలు నిర్వహించినట్టు తెలిసింది. ఈ చర్చల్లో ఏ పార్టీ ఏమిటి? ఆ పార్టీ చరిత్ర ఏమిటి? చేసిన అభివృద్ధి ఎంత? భవిష్యత్ భరోసా ఏమిటి? అనే అంశాలపై చర్చించారు. అందులో దాదాపు 95శాతం మంది వరకు ముఖ్యమంత్రి కేసీఆర్పైనే సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేయడంతోపాటు, బీఆర్ఎస్కే ఓటేయాలని అభిప్రాయపడ్డారు. ఆ మేరకు తీర్మానాలు కూడా చేసుకున్నామని పలువురు యువతీయువకులు వెల్లడించారు. ఊర్లకు వెళ్లి తాము ఓటు వేయడంతోపాటు, కుటుంబీకులను కూడా ఆ దిశగా ఓటేయించాలని, ప్రోత్సహించాలని కూడా బృందచర్చల్లో యువతీయువకులు చర్చించుకోవడం విశేషం.