హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఖండాంతరాల్లో ఉద్యమాలు జరిగాయి. తెలంగాణ ప్రవాసులు స్వరాష్ట్ర నినాదాన్ని ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పారు. అప్పటి ఉద్యమనేత, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లో నాడు తెలంగాణ కోసం, ఇపుడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. అనేక దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై శాఖలు ఇప్పటికీ చురుగ్గా పనిచేస్తున్నాయి. ఎడారి దేశం బహ్రెయిన్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) తొలి ఎన్నారై సెల్ ఆవిర్భవించి పదేండ్లు పూర్తి చేసుకొన్నది.
సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో దశాబ్దకాలంగా ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడుతున్నది. టీఆర్ఎస్ యూకే ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రస్తుత రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కూర్మాచలం విదేశాల్లోనూ తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చేందుకు 2012 డిసెంబర్లో బహ్రెయిన్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ఏర్పాటు చేశారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 30 మంది తెలంగాణ బిడ్డలతో మొదటిసారి గులాబీ జెండా ఎగురవేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటేందుకు బతుకమ్మ సంబురాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2014 నుంచి రక్తదాన శిబిరాలు, సామాజిక కార్యక్రమాలు జరుపుతున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, జయశంకర్ సార్ జయంతి, వర్ధంతులను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.
దేశగతిని మార్చేందుకే బీఆర్ఎస్
తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ర్టాన్ని సాధించి, అనతికాలంలోనే రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన నాయకుడు సీఎం కేసీఆర్. పొట్టచేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వచ్చిన మాకు కేసీఆర్ గుండెధైర్యాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్తో దేశగతిని మార్చేందుకు బయలుదేరిన సీఎం కేసీఆర్ వెన్నంటి ఉంటాం. పదేండ్లుగా బహ్రెయిన్లో ఎన్నారై సెల్ ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత, ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, టీఎస్ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలంకు ధన్యవాదాలు.
-రాధారపు సతీశ్కుమార్, బహ్రెయిన్శాఖ ఎన్నారై సెల్ అధ్యక్షుడు